కారు డ్రైవరుకు కరోనా వైరస్ : స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కవిత

శుక్రవారం, 24 జులై 2020 (08:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదేసమయంలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడగా, వారిలో పలువురు కోలుకున్నారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే, తాజాగా తెరాస మహిళా నేత, మాజీ ఎంపీ కె.కవిత కారు డ్రైవరుకు కరోనా వైరస్ సకింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆమె డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు కవిత సన్నిహిత వర్గాలు తెలిపాయి. 
 
ఇక తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గురువారం కొత్తగా 1,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును అధిగమించింది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కి చేరింది. తాజాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 662, రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 447కి పెరిగింది. ఇవాళ 1,661 మందిని డిశ్చార్జి చేశారు. మరో 11,052 మంది చికిత్స పొందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు