గొల్లల మామిడాలలో కలకలం ... ఒక్కడి ద్వారా 116 మందికి కరోనా

గురువారం, 4 జూన్ 2020 (15:38 IST)
నిత్యం పచ్చని పొలాలతో కనిపించే తూర్పు గోదవారి జిల్లాలో ఇపుడు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా తూర్పు గోదావరి జిల్లాలో కలకలం చెలరేగింది. ఈ జిల్లా వాసులు కరోనా వైరస్ పేరు వింటేనే వణికిపోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ద్వారా ఏకంగా 116 మందికి ఈ వైరస్ సోకడం కూడా వారి భయానికి కారణంగా మారింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లాలలోని పెదపూడి మండలం గొల్లల మామిడాల గ్రామం, ఆ చుట్టు పక్కల కరోనా క్రమంగా విజృంభిస్తోంది. అక్కడ తొలికేసే మరణంతో మొదలైంది. తాజాగా ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక వ్యక్తి ద్వారా 116 మందికి కరోనా సోకినట్టు వైద్య శాఖ అధికారులు గుర్తించారు. 
 
గొల్లల మామిడాడకు చెందిన ఆ వ్యక్తి (53) కరోనాతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరి పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఆసుపత్రిలో చేరిన అరగంటలోనే అతడి ప్రాణాలు పోయాయి. అతడు ఓ హోటల్‌లో పనిచేస్తూ ఫొటోగ్రాఫర్ గానూ వ్యవహరిస్తున్నాడు. 
 
అతడి కారణంగానే గొల్లలమామిడాడలోనూ, పరిసర గ్రామాల్లో కరోనా వ్యాపించిందని అధికారులు తెలుసుకున్నారు. ఇటీవల రామచంద్రపురం గ్రామంలో ఓ కార్యక్రమం జరగ్గా, ఈ వ్యక్తి ఫొటోలు తీశాడు. అంతేకాదు, స్థానికంగా ఓ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాస్కులు కూడా పంపిణీ చేశాడు.
 
అయితే అతడి కుమారుడు కూడా కరోనాతో బాధపడుతుండటంతో, ఎవరి ద్వారా ఎవరికి వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకే గ్రామంలో వందకు పైగా కేసులు రావడం దేశంలో ఇదే ప్రథమం కాగా, గొల్లల మామిడాడ గ్రామాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి, ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు