దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 75 లక్షలు - తెలంగాణాలో గణనీయంగా తగ్గుదల!

సోమవారం, 19 అక్టోబరు 2020 (10:28 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలు దాటిపోయింది. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
కాగా, దేశంలో గత 24 గంటల్లో 55,722 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,50,273కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 579 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,610 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 66,63,608 మంది కోలుకున్నారు. 7,72,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,50,83,976 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులోనే 8,59,786 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 948 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన 212 కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రిలీజ్ చేసిన బులెటిన్ విడుదల చేసింది.
 
తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,23,059కి పెరిగింది. మహమ్మారి కారణంగా ఆదివారం నలుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,275కు పెరిగింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 21,091 కేసులు యాక్టివ్‌గా ఉండగా, వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1,896 మంది కరోనా కోరల నుంచి బయటపడడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,00,686కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు