కరోనా పుణ్యం.. గంగమ్మ తల్లి పవిత్రమైంది.. ఎలాగంటే?

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (23:10 IST)
అవును.. పాపాలను తొలగించే గంగమ్మ తల్లి ప్రస్తుతం కరోనా పుణ్యంతో శుభ్రంగా వుంది. పాపాలు తొలగిపోతాయని.. పుణ్యం లభిస్తుందని.. వారణాసిలోని గంగానదిలో మునకలు వేస్తూ.. పవిత్ర గంగాజలాన్ని కాలుష్యం, విషపూరితం చేసిన మానవాళి నుంచి.. ప్రస్తుతం గంగమ్మ కాస్త విమోచనం లభించినట్లైంది. ఎలాగంటే.. భారత్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న కారణంగా పర్యావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
 
గతంలో గంగానది నీరు తాగడానికే కాదు, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావని గత సంవత్సరం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్న విషయం తెలిసిందే. అలాంటి తరుణంలో లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వాహనాలు, పరిశ్రమలు మూతపడడంతో కాలుష్య తీవ్రత భారీ స్థాయిలో తగ్గింది. తాజాగా వారణాసి, హరిద్వార్‌లలో ప్రవహించే గంగానదిలో నీరు ప్రస్తుతం స్వచ్ఛంగా ఉన్నట్లు పర్యావరణవేత్తలు, నిపుణులు గుర్తించారు. పట్టణానికి సమీపప్రాంతంలో ఉండే భారీ పరిశ్రమలు మూతపడడంతో గంగానది జలాలు గతంతోపోలిస్తే 40నుంచి 50శాతం శుద్ధిగా మారాయని తాజాగా ఐఐటీ-భువనేశ్వర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ వెల్లడించారు. 
 
అంతేకాకుండా వారణాసిలోని పలు హోటళ్లు మూసివేయడంతోపాటు నదిలోకి వచ్చే వ్యర్థపదార్థాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా ప్రస్తుతం నీరు తాగడానికి కూడా పనికొచ్చేవిధంగా మారాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంత గణనీయమార్పు కనిపించడం గడచిన కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారని అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు