ముంబై మురికివాడల్లో 57 శాతం మందికి కరోనా : తెలంగాణాలో కొత్త కేసులెన్ని?

బుధవారం, 29 జులై 2020 (12:38 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలోని మురికివాడల్లో ఏకంగా 57 శాతం మందికి కరోనా వైరస్ సోకివుంటుందని ఓ సర్వే వెల్లడిస్తోంది. ఆ న‌గ‌రంలోని సుమారు ఏడువేల మందిపై మెడిక‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. ఆ స‌ర్వే ఆధారంగా మురికివాడ‌ల‌కు సంబంధంలేని దాదాపు 16 శాతం మంది న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌న్న అభిప్రాయానికి వ‌చ్చారు.
 
సీరోలాజిక‌ల్ స్టడీ ఆధారంగా ఈ అంచ‌నా వేశారు. ఈ నెల ఆరంభంలో రెండు వారాల పాటు ర్యాండ్ శ్యాంప్లింగ్ ద్వారా ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. మ‌న‌షి శ‌రీరంలో ఉన్న యాంటీబాడీల ఆధారంగా సీరో స్ట‌డీ జ‌రుగుతుంది. ర‌క్తాన్ని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఆ ర‌క్తంలో రోగ‌నిరోధ‌కాలు ఎంత శాతం ఉన్నాయో సీరో స్ట‌డీలో తేలుస్తారు. అంటే మురిక‌వాడ‌ల్లోని 57 శాతం మందిలో క‌రోనా యాంటీబాడీలు ఉన్న‌ట్లు గుర్తించారు.
 
కాగా, ప్ర‌స్తుతం ముంబైలో క‌రోనా కేసులు ల‌క్ష దాటాయి. దేశంలో ఉన్న కేసుల్లో ఏడు శాతం ఇక్క‌డే ఉన్నాయి. ఈ న‌గ‌రంలోనే ఆరు వేల మంది వైర‌స్‌తో మృతిచెందారు. ముంబైలో మొత్తం 1.2 కోట్ల జ‌నాభా ఉన్న‌ది. దాంట్లో 65 శాతం మంది మురికివాడ‌ల్లోనే నివ‌సిస్తుంటారు. న‌గ‌ర శివార‌ల్లో మ‌రో 60 శాతం మంది జీవిస్తుంటారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1764 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 492కు చేరుకుంది. కొత్తగా నమోదైన సంఖ్యను కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 58,906 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 
 
వీరిలో 43,751 మంది కోలుకోగా మరో 14,663 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని బుధవారం రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటిన్‌లో వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 
 
జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా మరో 509 కేసలు నమోదు కాగా మేడ్చల్‌లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్‌ అర్బన్‌లో 138, కరీంనగర్‌లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 69, నల్గొండలో 51, నిజామాబాద్‌లో 47 కేసులు నమోదు అయ్యాయి. 
 
మహబూబ్‌నగర్‌లో 47, పెద్దపల్లిలో 44, వరంగల్‌ గ్రామీణంలో 41, సూర్యపేటలో 38, భద్రాది కొత్తగూడెంలో 30, నాగర్‌కర్నూలులో 29, మంచిర్యాలలో 28 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,97,939 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు