ఆర్బీఐ గవర్నరుకు కరోనా పాజిటివ్!! ఫడ్నవిస్‌కు కూడా....

ఆదివారం, 25 అక్టోబరు 2020 (21:57 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు మూడు రోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆయనకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆదివారం ట్వీట్‌ చేశారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి అంతా ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని శక్తికాంత దాస్‌ సూచించారు. 
 
ఇకపోతే, స్వీయ నిర్బంధంలో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానని ఆయన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. లాక్డౌన్ సమయం నుంచి తాను ప్రతి రోజు పని చేస్తున్నానని... ఇప్పుడు భగవంతుడు తనకు కొంత విరామాన్ని ఇచ్చాడని చెప్పుకొచ్చారు.
 
తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించిన వెంటనే... నెటిజన్లు ఆయనపై సెటైర్ల దాడి మొదలు పెట్టారు. గోమూత్రం తాగాలని, పతంజలి కోర్నిల్ ట్యాబ్లెట్లు వాడాలని, వదిన చేసిన అప్పడాలు తినాలని ఇలా రకరకాల సూచనలు ఇస్తూ కామెడీ చేస్తున్నారు.
 
ఇంకోవైపు, ఫడ్నవిస్ కరోనా బారిన పడటంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. బయట కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఫడ్నవిస్‌కు ఇప్పుడు అర్థమై ఉంటుందని సెటైర్ వేశారు. కరోనా బారిన పడిన ఫడ్నవిస్‌కు అత్యుత్తమ చికిత్స అందేలా ముఖ్యమంత్రి థాకరే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు