ఎయిర్‌పోర్టులలో కొవిడ్-19 పరీక్షకు ఎంత వసూలు చేస్తారు?

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (14:07 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా కొత్త కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. దీనికితోడు కొత్త రకం వైరస్‌లు వెలుగుచూశాయి. దీంతో విదేశీ ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. 
 
కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు ప్రయాణానికి మూడు రోజుల ముందుగా చేయించుకున్న కొవిడ్-19 రిపోర్ట్‌ను ఎయిర్ సువిదా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధన విధించింది. 
 
ముఖ్యంగా, కొవిడ్-19 రిపోర్ట్‌లో నెగిటివ్ వస్తేనే భారత్‌కు వచ్చేందుకు అనుమతి ఉంటుంది. నెగిటివ్ రిపోర్ట్ అప్‌లోడ్ చేసినప్పటికి విదేశాల నుంచి వచ్చే ప్యాసెంజర్లు భారత్ వచ్చిన తర్వాత మళ్లీ కొవిడ్-19 టెస్ట్ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేస్తారు. ఇందుకోసం ధరలను కూడా నిర్ధారించారు. వివిధ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులలో ఒక వ్యక్తికి కొవిడ్-19 టెస్ట్ రేట్ ఏ విధంగా ఉందంటే:
 
కేరళలోని కొచ్చి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో రూ.1500 నుంచి రూ.2 వేలు, ముంబైలో రూ.850, హైదరాబాద్‌లో రూ.1000, అహ్మదాబాద్‌లో రూ.800, బెంగళూరులో ఆర్టీపీసీఆర్ ఎక్స్‌ప్రెస్(రూ.3 వేలు - 30 నిమిషాల ప్రాసెసింగ్ టైమ్), ఆర్టీపీసీఆర్ నార్మల్ - రూ.500(నాలుగు గంటల ప్రాసెసింగ్ టైమ్), చెన్నైలో రూ.1200 నుంచి రూ.2500, ఢిల్లీలో రూ.800, కోల్‌కతాలో రూ.950 చొప్పున ధరలు నిర్ణయించారు. 
 
ఎయిర్ సువిదా పోర్టల్‌లో నెగిటివ్ రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా మరోమారు కొవిడ్-19 టెస్ట్ చేయడంపై ప్రవాసీయులు మండిపడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న భారతీయులు కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే కేరళకు చెందిన ప్రవాసీయులు కొవిడ్-19 టెస్ట్‌ను ఆపాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. తాము నెగిటివ్ రిపోర్ట్‌ అప్‌లోడ్ చేశాక మళ్లీ కొవిడ్-19 టెస్ట్ ఏంటంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఆర్థిక ఇబ్బందులను భరించలేక స్వదేశానికి వస్తోంటే, టెస్ట్‌ల పేరుతో తమ దగ్గర మళ్లీ డబ్బులను వసూలు చేయడం తగదంటూ వారు వాపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు