రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై : 45 రన్స్ తేడాతో విజయం

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (08:33 IST)
ఐపీఎల్ 14వ సీజన్ పోటీల్లో భాగంగా, గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
 
జట్టులోని రుతురాజ్ గైక్వాడ్ 10, డుప్లెసిస్ 33, మొయీన్ అలీ 26, రైనా 18, రాయుడు 17, రవీంద్ర జడేజా 8, కెప్టెన్ ధోనీ 18, శామ్ కరణ్ 13 పరుగులు చేయగా, బ్రేవో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీసుకోగా, క్రిస్ మోరిస్ 2, ముస్తాఫిజుర్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 45 రన్స్ తేడాతో చెన్నై మెరిసింది. జోస్ బట్లర్ (49), రాహుల్ తెవాటియా (20), జయదేవ్ ఉనద్కత్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు కూడా సాధించలేకపోయారు.
 
ఇకపోతే, చెన్నై బౌలర్లలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' మొయీన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, ధోనీ సేనకు ఇది రెండో విజయం. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు