మిమ్మలను నమ్మి నేను నిండా మునిగిపోయా? ఆ ఇద్దరిపై జగన్ చిందులు?!

మంగళవారం, 28 జనవరి 2020 (15:07 IST)
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల సలహాలు, సూచనలే ముఖ్యమంత్రి జగన్‌కు శాపాలుగా మారాయని, వారిద్దరి మాటలను గుడ్డిగా నమ్మి ముఖ్యమంత్రి జగన్‌ అప్రతిష్ట పాలయ్యారని ఇక ముందు కూడా వారిద్దరి సలహాలు వింటే.. ప్రభుత్వ ప్రతిష్ట మంట కలవటం ఖాయమంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొంతమంది మంత్రులు. మూడు రోజులు సమయం ఇచ్చినా ముగ్గురు ఎమ్మెల్సీలను మాత్రమే పార్టీ మార్చగలిగారు. మిగతా వారిని ఎందుకు మార్చలేకపోయారు అని ముఖ్యమంత్రి జగన్‌ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలను చివాట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
 
ఆర్డినెన్స్‌ను జారీ చేస్తానంటే.. మీ ఇద్దరు నన్ను తప్పు దోవపట్టించారు, మంత్రులతో పాటు మీ ఇద్దరు ముందుగా చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టలేకపోయారు. అంతా మాకు వదిలేయండి.. మేము చూసుకుంటాం అన్నారు. ఆ మంత్రులు, మీ ఇద్దరు పదవులకు పనికిరారు, మిమ్ములను నమ్మి నేను నిండా మునిగిపోయానని ముఖ్యమంత్రి జగన్‌ వారికి చీవాట్లు పెట్టినట్టు బయటకు పొక్కింది. 
 
ముగ్గురు ఎమ్మెల్సీలకు ఎంతఖర్చు పెట్టారు..? వారికి ఎంతెంత ఇచ్చారు..? ఇంకా ఎంత మంది టిడిపి ఎమ్మెల్సీలతో చర్చించారు. ఆ ఎమ్మెల్సీలు ఏయే కోర్కెలు కోరారు. అసలు మీరు ఆ ఎమ్మెల్సీలను కలిశారా.. అని ఎమ్మెల్సీల బాధ్యత భుజాన వేసిన మంత్రులను, విజయసాయి, సజ్జలను జగన్‌ నిలదీసినట్లు తెలిసింది. 12 మంది ఎమ్మెల్సీలను తీసుకువస్తామన్నారు.
 
ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే మనకు అనుకూలంగా చేయి ఎత్తారు. మరొక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాజీనామా లేఖ రాసి శాసనమండలికి రాలేదు. మిగతా తొమ్మిది మందిని ఎందుకు ఆకట్టుకోలేకపోయారు అని ముఖ్యమంత్రి జగన్‌ వారిపై కేకలు వేసినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రులు యనమల, లోకేష్‌లు ఎంతమంది ఎమ్మెల్సీలతో ఎంతసేపు మంతనాలు జరిపారు అనే విషయం కూడా తెలుసుకోలేకపోయారు. 
 
అనేక మంది ఎమ్మెల్సీలతో ఆ ముగ్గురు మంతనాలు జరుపుతుంటే.. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని జగన్‌ చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పదవులతో మంత్రులు అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు మునిసిపల్‌ మంత్రి బొత్స కూడా విఫలమయ్యారని, ఇక నుండి తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా, రాజకీయపరంగా వేసే ప్రతి అడుగు నాకు ముందుగానే తెలియాలి.. మీరు ఏం చేస్తారో.. నాకు అనవసరం. చంద్రబాబు వేస్తున్న ఎత్తులను పసిగట్టండి.. లేకుంటే మీకే నష్టం అని ముఖ్యమంత్రి జగన్‌ వారిని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదంతా చంద్రబాబు కుట్ర అని జగన్‌ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ వాటితో మాకు ఎలాంటి సంబందం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు