ప్రణబ్ ప్రస్థానం : ఉపాధ్యాయుడు నుంచి జర్నలిస్టు.. ఆపై రాష్ట్రపతి వరకు...

సోమవారం, 31 ఆగస్టు 2020 (19:22 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రణబ్ ముఖర్జీ.. రాజకీయాల్లోకి రాకముందు.. ఓ సాధారణ బడిపంతులు. ఆ తర్వాత జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. అంచలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన ఆజాతశత్రువు ప్రణబ్ ముఖర్జీ. 
 
సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం సాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. భారత మాజీ రాష్ట్రపతిగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి, ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చి... దేశ ప్రజలందరి మన్నలు పొందిన రాజకీయ నేత. తన 84 యేళ్ళలో కొద్దికాలం మినహా దాదాపు తన జీవితకాలమంతా పక్కా కాంగ్రెస్ నేతగానే ఆయన గడిపారు. అయినప్పటికీ పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు. అదే ప్రణబ్ దా ప్రత్యేకత. 
 
50 యేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ పని చేశారు. రాజకీయాల్లోకి అడుగుపట్టక ముందు టీచర్‌గా, జర్నలిస్టుగా పనిచేశారు. 1969లో ఆయన తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. బెంగాల్‌లోని జాంగిపూర్ నుంచి 2004లో ఆయన తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనా, దీనికిముందు వరుసగా నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు.
 
రాజకీయ వ్యూహకర్తగా, పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ ముఖర్జీ తిరుగులేని నేతగా కొనసాగారు. 1972లో ఇందిరాగాంధీ కేబినెట్‌లో పనిచేశారు. అప్పట్నించి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన చేపట్టిన అత్యంత శక్తివంతమైన శాఖల్లో ఆర్థిక శాఖ, వాణిజ్య, విదేశాంగ, రక్షణ శాఖ వంటివి ఉన్నాయి. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని ప్రభుత్వంలో ప్రణబ్‌ పనిచేయడంతో పాటు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ట్రబుల్ షూటర్‌గా పేరుతెచ్చుకున్నారు. 
 
ప్రణబ్ కెరీర్‌లో చివరి మజిలీ రాష్ట్రపతి భవన్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి నామినీగా ఆయన 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2017లో ఆయన పదవీకాలం ముగిసింది. జనవరి 2019లో ప్రణబ్‌ ముఖర్జీని అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' వరించింది. ఆ సందర్భంగా 'ఔట్ స్టాండింగ్ స్టేట్స్‌మన్ ఆఫ్ అవర్ టైమ్స్' అంటూ ప్రణబ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. 
 
కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఇందిర నమ్మిన బంటు 
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా, నమ్మినబంటుగా ప్రణబ్ పేరుగడించారు. అయితే, ఇందిర మరణం తర్వాత పార్టీ సారథ్య బాధ్యతలను రాజీవ్ గాంధీకి అప్పగించే విషయంలో ఆయన తనలోని అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇందిరాకు తానే రాజకీయ వారసుడినని భావించిన ప్రణబ్ ఆ స్థానం రాజీవ్‌కు దక్కడంతో కాంగ్రెస్‌తో విభేదించారు.
 
కాంగ్రెస్ సారథిగా, దేశ ప్రధానిగా రాజీవ్ బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ గాంధీ ప్రధాని మంత్రి కావడాన్ని, కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడాన్ని దాదా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌లో తనకున్న అనుభవం రీత్యా, ఇందిరకు నమ్మిన బంటుగా మెలిగిన తనకు ఆ స్థానం దక్కుతుందని ప్రణబ్ ఆశించారు. అయితే.. రాజీవ్‌నే కాంగ్రెస్‌లో మెజార్టీ నేతలు ప్రధానిగా బలపరచడంతో ప్రణబ్‌కు మద్దతు కరువైంది.
 
దీంతో.. వెనుదిరిగే స్వభావం లేని ప్రణబ్ 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలు తప్పనిసరి. ఆ రాజకీయ లెక్కలు రచించడంలో విఫలమైన ప్రణబ్ తనకిక ప్రజలు మద్దతు కష్టమని భావించి ఎన్నికల్లో పోటీ చేయకుండానే 1989లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మళ్లీ సొంత పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు