వడదెబ్బ ఎందుకు తగులుతుంది?

శుక్రవారం, 3 మే 2019 (14:00 IST)
వేసవికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందన్న అంశాన్ని పరిశీలిస్తే, శరీరం శీతలీకరణ వ్యవస్థ కోల్పోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల సెల్సియస్‌కిపైగా పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, గుండె దడ, వాంతులు, వికారం, విరోచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ముఖ్యంగా, నీరు, ఇతర శీతలపానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లవలసిన పరిస్థితి ఉంటే వదులుగా ఉండే, పల్చని, లేతవర్ణం దుస్తులు వేసుకోవాలి. కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది. తలపై ఎండపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
మద్యపానం, కెఫిన్‌ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్ర విసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి తీసుకోకపోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. చల్లగాలి తగిలేలా ఉండటం మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు