కోవిడ్ నియంత్రణకు వాడే మందులతో అనేక కోవిడ్ అనంతర సమస్యలు

సోమవారం, 9 నవంబరు 2020 (21:01 IST)
కోవిడ్ 19 మహమ్మారి గురించి, ఇందా దాని వలన వైద్యపరంగా జరిగే ప్రమాదాల గురించి ముఖ్యంగా శ్వాస సంబంధిత అవయవాల సమస్యల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలుసు. కోవిడ్ కారణంగా పిత్తాశయం పనిచేయకపోవడం, మూత్రపిండాలు తీవ్రంగా గాయపడటం, థ్రోమ్బోటిక్ వంటి ఇతర సమస్యలను కోవిడ్ రోగులు ఎదుర్కోవచ్చునని మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు తెలియజేస్తున్నారు.
 
కోవిడ్‌ని నియంత్రించడానికి వాడే మందులు కొన్నిసార్లు నియంత్రించలేనటువంటి మధుమేహ సమస్యలకు దారితీయవచ్చు. హాస్పిటల్లో జరిగిన ఒక సమావేశంలో పోస్ట్ కోవిడ్ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి, ఇంకా పోస్ట్ కోవిడ్లో ఏర్పడే సమస్యలను ఎదుర్కోవలసిన విధానాల గురించి డాక్టర్లు మాట్లాడారు.
 
డాక్టర్ వి.వి.కె సందీప్, కన్సల్టెంట్, ఇఎన్‌టి, హెడ్ అండ్ నెక్ సర్జరీ, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మాట్లాడుతూ... స్టెరాయిడ్స్‌ను అధిక మోతాదులో వాడటం వల్ల లేదా అనేక రకాల యాంటిబయాటిక్స్ వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ దాడికి దారితీసే ప్రమాదం వుంది. కోవిడ్ రోగులకు కావలసినప్పుడు మాత్రమే పరిమత మోతాదులో మరియు పరిమిత కాలానికి స్టెరాయిడ్స్ వాడటం, హాస్పిటల్లో వున్నప్పుడు మరియు డిశ్చార్జ్ అనంతరం బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంచుకోవడం మరియు అధిక లక్షణాలతో అనుమానం మొదలైనవి ఫంగల్ ఇన్ఫెక్షన్ దాడిని నివారించవచ్చు. ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ దాడిని డయాగ్నైజ్ చేసిన తర్వాత, దానికి శస్త్రచికిత్స చేయడం, యాంటీ ఫంగల్ మందులు వాడటం మరియు మధుమేహాన్ని నియంత్రణలో వుంచడం వంటివి అవసరమవుతాయని తెలిపారు.
 
డాక్టర్ శ్రీధర్ ఎవిఎస్ఎస్ఎన్ కన్సెల్టెంట్ నెఫ్రాలజీ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మాట్లాడతూ.. గత 2 నెలల్లో కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఫంగల్ సైనసైటీస్ బారిన పడ్డ 19 మంది రోగులకు చికిత్స అందించాము. త్వరగా కనుగొనడం వల్ల 18 మంది పేషెంట్లకు శస్త్రచికిత్స మరియు వైద్య విధానాల ద్వారా నయం చేయగలిగాము. రోగులందరూ కూడా అంతకుముందే మధుమేహ వ్యాధితో బాధపడుతూ కోవిడ్ నియంత్రణలో స్టెరాయిడ్స్‌ను వాడటం జరిగిందని తెలిపారు.
 
డాక్టర్ మురళీకృష్ణ గంగూరి, కన్సల్టెంట్, డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ, విజయవాడ మాట్లాడుతూ... మావద్దకు వచ్చే రోగులు చూపు కోల్పోవడం, చూపు మసకబారడం, తలనొప్పి, పంటినొప్పి, మొహంలో నొప్పి, రుచి కోల్పోవడం, కణతల దగ్గర నొప్పి ఇంకా మొహంలో పక్షవాతం(మొద్దుబారిపోవడం) వంటి వివిధ ఫిర్యాదులతో వస్తున్నారు. చాలా ముఖ్యమైన విషయమేమిటంటే డాక్టర్ల వద్దకు సరియైన సమయంలో వస్తే విషమ పరిస్థితులలోకి పరిస్థితి దిగజారిపోకుండా కాపాడవచ్చు అని తెలిపారు. 
 
సమావేశాన్ని ముగుస్తూ డాక్టర్ సుధాకరం కంటిపూడి, హాస్పిటల్ డైరెక్టర్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మాట్లాడుతూ... ఈ సమస్యలు ప్రధానమైన వాటిల్లో భాగమైనవి కానప్పటికీ ఒక్కోసారి అవి విషమ పరిస్థితులకు దారి తీయవచ్చు. మధుమేహంతో బాధపడుతూ కోవిడ్ ఎదుర్కొంటున్నవారికి ఈ సమస్యల పట్ల అవగాహన కల్పించడం, అలాగే ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ జాగురూకులై వుండాలని తెలుపడమే తమ ఉద్దేశ్యమని తెలిపారు.
 
ఇటువంటి సందర్భాలలో త్వరగా కనుగొనడం మరియు తక్షణ వైద్యం మరణాలను తగ్గిస్తాయని, ఈ విధమైన సమస్యలను తప్పించుకోవడానికి కోవిడ్ సమయంలో ఆ తర్వాత చక్కెర పరిమాణాలు అదుపులో వున్నాయని నిర్థారించుకోవాలని తెలిపారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న పేషెంట్ అమ్రిత్ లాల్, వెంకటేశ్వర రావు తమ అనుభవాలను, అలాగే తెలుసుకున్న వాటిని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు