'మోడీ' సంకల్పానికి నరసింహస్వామిని తీసుకొస్తున్న పురాణపండ శ్రీనివాస్

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (12:46 IST)
కొవిడ్‌ 19 సృష్టించగల మానవ మహావిషాదం తాలూకు భయంతో భారత్ సహా పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా వ్యాప్తి నిరోధానికి ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఈ భయంకర వ్యాధి ఇబ్బంది నుంచి రక్షించమని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి మద్దతుగా, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి సమర్పణలో తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభట్ల, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు ఒక అద్భుతమైన దైవీయ గ్రంథాన్ని ప్రచురించి ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాలలో లక్షల ప్రతులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
 
ఆది శంకరాచార్య ప్రణీతమైన మహాశక్తి సంపన్నస్తోత్రమ్ "శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్' ప్రచురణ మహత్కార్యాన్ని ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్‌కి అప్పగించారు. పురాణపండ శ్రీనివాస్ అపురూప మహాగ్రంథం' నన్నేలు నాస్వామిని ఇటీవల భారత హోం శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి శ్రీనివాస్‌పై ప్రశంసలు వర్షించిన విషయం తెలిసిందే.
 
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ 'జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం' సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వెలువరించిన ఎన్నో సమ్మోహన గ్రంథాలకు భారీ డిమాండ్ ఉన్న విషయం భక్త పాఠకులకూ, రసజ్ఞులకూ తెలిసిందే. 
 
భారతదేశంలో ప్రముఖమైన పదహారు నృసింహ క్షేత్రాల మూలవిరాట్టుల మనోహర మంగళదృశ్యాలతో, అందమైన వ్యాఖ్యాన వైఖరితో పరమశోభాయమానంగా ఈ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దుతున్నారు. శంకర జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్న ఈ పుస్తకాన్ని భారతీయ జనతాపార్టీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు