కరోనా టీకా వేయించుకుని ఉద్యోగం కోల్పోయిన సీఈవో...

బుధవారం, 27 జనవరి 2021 (12:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా కొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాను పలు దేశాల్లో శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ కూడా కోవిడ్ వారియర్లకు ఈ టీకాలను తొలుత పంపిణీ చేస్తున్నారు. అయితే, కొందరు వీఐపీలు ఈ టీకాలు త్వరగా వేయించుకోవాలన్న ఆతృత చూపుతున్నారు. ఇలాంటి వారిలో మిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవోగా ఉన్న ఓ వ్యక్తికూడా ఉన్నారు. ఇందుకోసం తన ఐడెంటిని మార్చుకుని టీకా వేయించుకున్నాడు. చివరకు ఈ విషయం బహిర్గతం కావడంతో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇది కెనడాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా టీకాలను తమ దేశ ప్రజలకు కూడా కెనడా ప్రభుత్వం టీకాను అందిస్తోంది. ఈ క్రమంలో బిలియన్ డాలర్ల విలువ చేసే ఓ కెనెడియన్ క్యాసినో సంస్థ (గేమింగ్ కార్పొరేషన్)కు సీఈఓగా వ్యవహరిస్తున్న రాడ్ బేకర్.. కొవిడ్-19 నుంచి సాధ్యమైనంత త్వరగా రక్షణ పొందాలని భావించాడు. 
 
ఇందులోభాగంగా పట్టుమని 150 మంది జనాభా కూడా లేని మారుమూల ప్రాంతమైన బీవర్ క్రీక్‌కు తన భార్యతోపాటు కలిసి వెళ్లాడు. రాడ్ బేకర్ దంపతులు అక్కడ తమ ఐడెంటినీ మార్చుకుని.. మోటెల్(హోటల్) కార్మికులమని చెప్పి, మోడెర్నా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అనంతరం వారి స్వస్థాలానికి పయనమయ్యారు. ఈ క్రమంలో వారి బండారం బయటపడింది. 
 
రాడ్ బేకర్ దంపతులు మోటెల్ కార్మికులు కాదని స్థానిక అధికారులు గుర్తించారు. దీంతో చివరికి ఆ దంపతులు చేసిన తప్పును అంగీకరించారు. వ్యాక్సిన్‌ను పొందడం కోసం మోటెల్ కార్మికులుగా అబద్ధం అడినట్టు అంగీకరించారు. ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో రాడ్ బేకర్.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 
 
ఈ వ్యవహారంపై యుకాన్ కమ్యూనిటీ సర్వీసెస్ మంత్రి జాన్ స్ట్రైకర్ స్పందించారు. రాడ్ బేకర్ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, యుకాన్ సివిల్ ఎమర్జెన్సీ నిబంధనలను అతిక్రమించినందుకు రాడ్ బేకర్ దంపతులకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు భారీ జరిమానాను విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు