కరోనా టైంలో ఆ థాట్ వచ్చింది, ఆచరణలో పెట్టాం: రెడ్ మూవీపై 'స్రవంతి’ రవికిశోర్‌

మంగళవారం, 19 జనవరి 2021 (22:01 IST)
సినిమా అనేది వెండితెర‌పై చూడాల్సిందే. ఓటిటి అనేది మ‌ధ్య‌లోనే వ‌చ్చింది. దాని ద్వారా లాభాలు వ‌స్తాయి. అది హీరో కెరీర్‌కు హెల్ప్ అవుతుంద‌నేది నిజం కాదు.. అంటూ... `రెడ్‌1 నిర్మాత స్రవంతి’ రవికిశోర్ తెలియ‌జేస్తున్నారు. రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘రెడ్‌’. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది. నాలుగు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయింది. ఈ నెల 22 మలయాళంలో, ఆ తర్వాత వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్‌తో ఇంటర్వ్యూ...
 
‘రెడ్‌’ ఫీడ్ బేక్ ఎలా వుంది?
ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని, వసూళ్ల వస్తాయని ముందు నుంచీ నమ్మకం ఉంది. వాళ్లకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ఇన్నాళ్లు ఎదురుచూశాం. థియేటర్లలో సినిమా చూసి బావుందని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది.
 
విడుదలైన నాలుగు రోజుల్లోనే సినిమా లాభల బాటలోకి వచ్చిందంటున్నారు?
నిజ‌మే. తొలి రోజు సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండో రోజు రూ. 4.17 కోట్లు, మూడో రోజు రూ. 2.71 కోట్లు, నాలుగో రోజు రూ. 2.26 కోట్ల షేర్‌ వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే... మేజర్‌ ఏరియాలు కొన్నిటిలో మేం విడుదల చేసినప్పటికీ, మిగతా ఏరియాల్లో చాలా రీజనబుల్‌ రేటుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం. 
 
కరోనాకి తోడు 50 శాతం ఆక్యుపెన్సీని దృష్టిలో పెట్టుకుని... మామూలు రేటు కంటే తక్కువ రేటుకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఆ డబ్బులు కూడా వచ్చేశాయి. తక్కువ రేటుకు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది ఏమీ జరగలేదు. మనకు వస్తాయనుకున్న డబ్బుల్లో కొంత తగ్గింది తప్పితే... నష్టపోయింది ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి ఎదుర్కొనాలనేది నా అభిమతం. కరోనా సమయంలోనూ... ఓ రేటుకు సినిమాను అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్‌ చేయాలనేది వచ్చిందో, అప్పుడు మళ్లీ రేటు తగ్గించి... ఈ విధంగా చేస్తే మీకూ, మాకూ కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందని అనడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకొచ్చారు. సరిపడా థియేటర్లలో విడుదల చేశారు. 
 
వాళ్లు పెట్టిన పెట్టుబడి కొన్నిచోట్ల రెండో రోజు, కొన్ని చోట్ల మూడో రోజే తిరిగి వచ్చేసింది. పశ్చిమ గోదావరిలో రెండో రోజుకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తూర్పు గోదావరిలో మూడో రోజు బ్రేక్‌ ఈవెన్‌ అయింది. నాలుగు రోజుల్లో అందరికీ లాభాలు వచ్చాయి.
 
పెదనాన్నగారు చిత్రాన్ని చంటిబిడ్డలా కాపాడుకుంటూ వచ్చి థియేటర్లలో విడుదల చేస్తున్నారు’ అని రామ్‌ చెప్పారు. కరోనా సమయంలో పరిస్థితుల ప్రభావం వలన ఓటీటీకి ఇవ్వాలని అనిపించిందా?
మొదట్నుంచీ ఎన్నాళ్లయినా థియేటర్లలోనే సినిమాను విడుదల చేద్దామని నిశ్చయించుకున్నా. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పిన ఓ మాట నాకు బాగా నచ్చింది. అదేంటంటే... ‘యాక్టర్లను, హీరోలను స్టార్స్‌ చేసేది పెద్ద స్కీనే (వెండితెరే). చిన్నతెర‌‌ (బుల్లితెర) కాదు’. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు! హీరోల ఇమేజ్‌ పెరిగి, వాళ్లు పది కాలాల పాటు ప్రజల మనసుల్లో ఉండాలంటే... ప్రేక్షకులు పెద్ద స్ర్కీన్‌ మీద సినిమా చూడాలి. నా ఉద్దేశంలో థియేటర్‌ కోసం చేసిన సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా ఓటీటీకి ఇవ్వడమనేది కరెక్ట్‌ కాదు.
 
సినిమాపై ప్యాషన్‌ ఉన్నవాళ్లు ఎవరూ అలా చేయరు. వ్యాపారం కోసం సినిమాను చేసేవాళ్లను మనం ప్రశ్నించలేం. ‘నేను పదిరూపాయల పెట్టుబడి పెట్టా. 12 రూపాయలు వస్తే చాలు’ అనుకునేవాళ్లు వేరు. పది రూపాయలకు తొమ్మిది వచ్చినా, 12 వచ్చినా ప్రేక్షకుడి నుంచి రావాలని నేను ఆలోచిస్తా. ఇటువంటి నిర్మాతలం కొంతమంది ఉన్నాం. సినిమా అంటే ప్యాషన్‌ అని చెప్పినవాళ్లు థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే వాళ్ల మాటలు నమ్మవద్దు. ఆ మాటకు వాళ్లు అర్హులు కాదు.
 
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. దాని తర్వాత రామ్‌తో మరో కమర్షియల్‌ సినిమా కాకుండా ‘రెడ్‌’ వంటి థ్రిల్లర్‌ చేయడానికి కారణం?
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కంటే ముందు ఈ సినిమా చేద్దామని నేను అనుకున్నా. రామ్‌ చేస్తాడా? లేదా? అనేది అప్పటికి తెలియదు. చేస్తే బావుంటుందని అనుకున్నా. సాధారణంగా నా సినిమాలన్నీ రామ్‌తో చేశా. అయితే... ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ భయపెట్టింది. అంత పెద్ద రేంజ్‌ సక్సెస్‌ తర్వాత ‘రెడ్‌’ చేయడం ఎంత వరకూ కరెక్ట్‌? అని చాలారోజులు మేం డిస్కస్‌ చేసుకున్నాం. ఏ హీరోకైనా సూపర్‌ సక్సెస్‌ వచ్చిన తర్వాత, నెక్ట్స్‌ సినిమా ఏదైనా అంతకు ముందు సినిమా సక్సెస్‌తో పోలుస్తారు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ కంపేరిజన్స్‌ని రామ్‌ ఎదుర్కొక తప్పదు. 
 
‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ‘రెడ్‌’ను పోల్చలేం. కానీ, మంచి చిత్రమిది. ఇందులో యాక్టింగ్‌కి స్కోప్‌ ఉంది. అందుకని, ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ఇప్పటివరకూ రామ్‌ కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. రెండు పాత్రల్లో మంచి నటన కనబరిచాడు. గతంలో ‘నేను శైలజ’ వంటి క్లాస్‌ సినిమాలు రామ్‌ చేశాడు. తనలో మాస్‌ కోణాన్ని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బయటకు తీసుకొచ్చింది. ‘రెడ్‌’లో ఆదిత్యతో మాస్‌ ఆడియన్స్‌, సిద్ధార్థ క్యారెక్టర్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చింది.
ఇటీవల ‘రెడ్‌’ మలయాళం ట్రైలర్‌ విడుదల చేశారు. ఏడు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. మిగతా భాషల్లో విడుదల చేసే ఆలోచన ముందు నుంచీ ఉందా?
మూడు నాలుగేళ్ల నుంచి రామ్‌ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. రామ్‌ చేసిన క్లాస్‌ సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. ‘నేను శైలజ’ను హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కి 300 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ‘ఉన్నది ఒకటే జిందగీ’కి 190 మిలియన్స్‌, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి 271 మిలియన్స్‌, ‘హైపర్‌’కి 120 మిలియన్స్‌, ‘గణేష్‌’కి 100 మిలియన్స్‌, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి 150 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన ఏకైక దక్షిణాది హీరో రామ్‌ అని చెప్పవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి సినిమాను తీసుకువెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కరోనా సమయంలో వచ్చింది.
 
అన్ని భాషల్లో రామ్‌ను ఆదరిస్తున్న అభిమానులకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇది రామ్‌ నేషనల్‌ లెవల్‌ ఎంట్రీ కాదు. ఈ నెల 22న మలయాళంలో ‘రెడ్‌’ విడుదలవుతుంది. బహుశా.. ఫిబ్రవరి మొదటి వారంలో హిందీలోనూ విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాం. తెలుగునాట ధైర్యంగా సినిమాలను విడుదల చేయడంతో మిగతా భాషల్లో ముందడుగులు వేస్తున్నారు.
 
‘రెడ్‌’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో మీ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్‌ ఎమోషనల్‌ అయ్యారు.?
అవును. తన ప్రయాణం మా సంస్థలో అలా మొదలైంది కదా! ఎవరూ తమ ప్రయాణాన్ని మర్చిపోరు కదా! నాకు ‘లేడీస్‌ టైలర్‌’ సమయంలో అటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అది కాకుండా... మా ఇద్దరి అనుబంధం వేరు. సన్నివేశాలు, పాత్రలు, కథల గురించి మాట్లాడుకుంటూ సినిమా మేకింగ్‌ ఎంజాయ్‌ చేశాం. వెనక్కి తిరిగి చూసుకుంటే... సినిమా మేకింగ్‌ డేస్‌ అవే అనిపిస్తుంది.
 
‘స్ర్కిప్ట్‌ను పూర్తిగా చదివే నిర్మాతలు ఇద్దరే... రామానాయుడుగారు, ‘స్రవంతి’ రవికిశోర్‌గారు’ అని త్రివిక్రమ్‌ చెప్పారు. ఇండస్ట్రీలో కాలానుగుణంగా అప్పట్నుంచి ఇప్పటికి మీరు గమనిస్తున్న మార్పులు?
నాలో ఏ మార్పూ లేదు. ఎవరి పద్ధతి వాళ్లది. మిగతావాళ్ల గురించి చెప్పలేను. ఇవాళ్టికీ... ఆఖరి షాట్‌తో సహా బౌండెడ్‌ స్ర్కిప్‌ ఉంటేనే గానీ, కథ తెలిస్తేనే గానీ సినిమా చేయను. ఐప్యాడ్‌లో స్ర్కిప్ట్‌ ఉంటుంది. లేదంటే బౌండెడ్‌ స్ర్కిప్ట్‌ ఫైల్‌ నా దగ్గర ఉంటుంది. అలా లేకపోతే సినిమా చేయను. చేయడం కరెక్ట్‌ కూడా కాదు.
 
రామ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మీ నిర్మాణ సంస్థలో సినిమా ఏదైనా ప్లాన్‌ చేస్తున్నారా?
చూద్దాం... దేనికైనా టైమ్‌ రావాలి. త్రివిక్రమ్‌కి ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉండి ఉంటాయి. తను ‘ఎస్‌. మనం సినిమా చేద్దాం’ అంటే ఎప్పుడైనా నేను సిద్ధమే.
 
ఉత్తరాది ప్రేక్షకుల్లో రామ్‌కు మంచి ఆదరణ ఉంది. ఇటీవల జాన్‌ అబ్రహంతో కలిసి ‘గార్నియర్‌’ యాడ్‌ చేశారు. పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా?
మంచి స్ర్కిప్ట్‌ వచ్చి ఎగ్జైట్‌ అయితే తప్పకుండా చేస్తాడని అనుకుంటున్నాను. ఈ ప్రశ్న రామ్‌ను అడగటమే సబబు. ఆయ‌న స‌మాధానం చెబుతాడు.. అంటూ ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు