ఐపీఎల్ 2020 : హ్యాట్రిక్‌పై రాజస్థాన్ కన్ను - విజయమే లక్ష్యంగా కేకేఆర్

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:44 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇపుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. ముఖ్యంగా, పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించి పెను ప్రకంపనలు సృష్టించిన రాజస్థాన్ ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌పై గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా కూడా విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే మెరికల్లాంటి క్రికెటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 
 
ప్రధానంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా, కెప్టెన్ స్టీవ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. ఈ త్రయం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి పోయింది. దీంతో రాజస్థాన్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించింది. 
 
శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. అతన్ని కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు శక్తికిమించిన పనిగా తయారైంది. ఇక స్మిత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. తెవాటియా కూడా జోరుమీదుండటం రాజస్థాన్‌కు ఊరటనిచ్చే విషయం. 
 
ఇక కోల్‌కతా జట్టులో శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. మోర్గాన్ కూడా గాడిలో పడటం కోల్‌కతా కలిసి వచ్చే అంశంగా మారింది. బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. దీంతో కోల్‌కతా కూడా గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
 
కాగా, ఈ ఇరు జట్లూ ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 20 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లూ పదేసి సార్లు గెలుపొందాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుది. పాయింట్ల పట్టికల్ రాజస్థాన్ (పాయింట్లు 4) అగ్రస్థానంలో ఉంటే.. కేకేఆర్ (పాయింట్లు 2) జట్టు ఏడో స్థానంలో ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు