గురుగ్రామ్‌లో ఐటీ కంపెనీలకు మరో మూడు నెలలు తాళాలు

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (12:43 IST)
హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకున్న హర్యానా.. ఇపుడు ఐటీ కంపెనీలు మరో మూడు నెలల పాటు కార్యకలాపాలు కొనసాగించేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీచేసింది. అంటే.. జూలై 31వ తేదీ వరకు ఐటీ కంపెనీలు తెరిచేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. అదేసమయంలో వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
గురుగ్రామ్‌లో అనేక మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. కరోనా వైరస్ దెబ్బ అన్ని ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. కానీ, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇవ్వాలని హర్యానా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 
 
నగరంలోని ఎంఎన్సీలు, బీపీఓలు, ఐటీ ఈఎస్ సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీఎస్ కుందూ తెలియజేశారు. గురుగ్రామ్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, జెన్‌పాక్ట్, ఇన్ఫోసిస్ సహా ఎన్నో కంపెనీలున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలూ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నాయి. 
 
ఇక్కడి కొన్ని కంపెనీలు పీపీఈ కిట్లను, మాస్క్‌లను కూడా తయారు చేస్తున్నాయి. అయితే, గురుగ్రామ్‌లోని ఆటో మొబైల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 51 మందికి కరోనా సోకడంతో, ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా గుర్తించిన అధికారులు, నిబంధనలను కఠినం చేశారు. ముఖ్యంగా నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ ప్రాంతంలో పరిశ్రమలను తెరిచేందుకు ఇంకా అనుమతి లభించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు