టిక్ టాక్ తిప్పలు అన్నీ ఇన్నీకావు... షాకింగ్ నిర్ణయం!?

శుక్రవారం, 10 జులై 2020 (18:40 IST)
భారత భూభాగమైన తూర్పు లడఖ్‌కు సమీపంలోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య జరిగిన వివాదం చివరకు టిక్ టాక్‌తో సహా 59 చైనా యాప్‌ల మెడకు చుట్టుకుంది. మిగిలిన యాప్‌ల సంగతి ఏమోగానీ... టిక్ టాక్‌కు మాత్రం అపారనష్టం వాటిల్లింది. చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. 
 
ఈ నిషేధంతో భారత్‌లోని కోట్లాది మంది యూజర్లను కోల్పోయి, ఆర్థికంగా కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. ఇపుడు అమెరికా కూడా ఓ బాంబు పేల్చింది. తమ దేశంలో కూడా టిక్ టాక్ యాప్‌ను నిషేధించే అంశాన్ని ముమ్మరంగా పరిశీలిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకరు వెల్లడించారు. ఇదే జరిగితే ఆ యాప్ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. 
 
దీంతో అమెరికా వార్తలతో అప్రమత్తమైంది. తమది చైనా యాప్ అయినప్పటికీ.. పక్షపాతంగా వ్యవహరించలేదని, ఇతర దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ ఆరోపణల నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఇందులోభాగంగా, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా.. బీజింగ్‌ నుంచి తమ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని భావిస్తోంది. అంతేకాదు, కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో బైట్‌డ్యాన్స్ ఉన్నట్లు తెలిసింది. 
 
తద్వారా.. చైనా ముద్రను తొలగించుకోవాలన్నది బైట్‌డ్యాన్స్ వ్యూహంగా తెలుస్తోంది. టిక్‌టాక్, హెలో యాప్‌లు రెండింటికి బైట్‌డ్యాన్స్ మాతృ సంస్థ కావడం గమనార్హం. ఈ రెండు యాప్‌లు నడవాలంటే చైనాకు దూరం దూరంగా ఉండాల్సిందేనని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు