సార్వత్రిక ఎన్నికలు : బీజేపీకి అత్తెసరు మార్కులేనా?

సోమవారం, 6 మే 2019 (15:06 IST)
దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా, మే 6వ తేదీ సోమవారం ఐదో దశ పోలింగ్ జరిగింది. తొలి నాలుగు దశల్లో మొత్తం 430 లోక్‌సభ సీట్లకు ఎన్నికల పోలింగ్ జరుగగా, ఐదో దశలో ఏడు రాష్ట్రాల్లో 51 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరిగింది. 
 
అయితే, ఇప్పటివరకు జరిగిన తొలి నాలుగు దశల ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే, అధికార భారతీయ జనతా పార్టీకి అత్తెసరు మార్కులు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, 430 సీట్లలో బీజేపీ కేవలం 180 సీట్లు, దాని మిత్రపక్షాలకు 30 సీట్లు రావొచ్చని భావిస్తున్నారు. మొత్తంమీద బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి 200 నుంచి 210 సీట్లకు మించవని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 
 
దీనికి అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, తొలి, రెండు దశల్లో దక్షిణాదిలో మొత్తం 129 సీట్లకుగాను ఈ దఫా కేవలం పది లేదా 15 సీట్లకు పరిమితం కావొచ్చని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 21 సీట్లను గెలుచుకుంది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌ సభ సీట్లకుగాను బీజేపీ ఏకంగా 71 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామ్య పక్షాలు రెండు సీట్లను కైవసం చేసుకున్నాయి. కానీ, దఫా ఈ సంఖ్యం 30 లేదా 35కు పరిమితం కావొచ్చని భావిస్తున్నారు. ఈ దఫా ఎన్నో ఆశలు పెట్టుకున్న వెస్ట్ బెంగాల్‌లో బీజపీ బలం కేవలం రెండు సీట్లకు మించదని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 
 
ఇకపోతే, గత 2014 ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో 20, రాజస్థాన్‌లో 12, ఛత్తీస్‌గఢ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 18, బీహార్‌లో 31 సీట్లలో గెలుపొందింది. కానీ, ఈ దఫా మాత్రం ఈ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సీట్లను కోల్పోయే అవకాశం ఉందట. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 282 సీట్లను కైవసం చేసుకోగా, దాని మిత్రపక్షాలు 54 సీట్లలో గెలుపొందాయి. ఈ దఫా సంఖ్య మాత్రం కేవలం 200 లేదా 210కి పరిమితం కావొచ్చని భావిస్తున్నారు. అందుకే ఐదు, ఆరు, ఏడు దశల్లో జరిగే ఎన్నికల పోలింగ్‌పై కమలనాథులు ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో విపక్షాలు సైతం ధీటుగా ఎదుర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు