అలా వాడేశారు.... కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల రికార్డు

బుధవారం, 20 మే 2020 (09:23 IST)
కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ 647.559 టీఎంసీలు వినియోగించుకుంటే.. తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ వాటా వినియోగం పూర్తి కాగా.. తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది.

ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, మధ్యతరహా ప్రాజెక్ట్‌లలో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది.

రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలను కృష్ణా బోర్డు పక్కాగా తేల్చుతోంది. అంతకుముందు అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉండేది కాదు. ఇదీ లెక్క

► నీటి సంవత్సరం జూన్‌ 1న ప్రారంభమై.. మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 
► నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు.
► శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ–నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్‌ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. 
► శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది.
► సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఎడమ కాలువ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
► సాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాలువ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎంసీలను తెలంగాణ ఉపయోగించుకుంది.
► తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుంచి హెచ్చెల్సీ ద్వారా 30.192, ఎల్లెల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్‌ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
► ఆర్డీఎస్‌ ద్వారా తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. 
► జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
► మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్యతరహా ప్రాజెక్ట్‌ల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
► ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంత రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల లభ్యత ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది.
► ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు కాగా.. తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు