భారత్ లో రోజుకు సగటున 87 అత్యాచారాలు

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (08:38 IST)
మహిళపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వెల్లడించింది.

2019లో మహిళలు, ఆడపిల్లలపై రోజుకు సగటున 87 అత్యాచార కేసులు చోటుచేసుకోగా... 4,05,861 నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ' క్రైమ్స్‌ ఇన్‌ ఇండియా-2019 పేరుతో విడుదల చేసిన నివేదికలో గత ఏడాదితో పోలిస్తే ..మహిళలపై అఘాయిత్యాలు 7.3 శాతం పెరిగినట్లు తెలిపింది.

2019లో ప్రతి లక్ష మంది మహిళలపై జరుగుతున్న నేరాల రేటు 62.4 శాతంగా నమోదైంది. 2018లో ఈ క్రైమ్‌ రేట్‌ 58.8 శాతంగా ఉంది.

దేశ వ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు, దాడులు డేటాను ఎన్‌సిఆర్‌బి సేకరించి..విశ్లేషించింది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 53 మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఈ సర్వే చేపట్టి మూడు విభాగాలుగా నివేదికను సిద్ధం చేసింది.

2018లో మహిళలపై దాడులకు సంబంధించి మొత్తం 3,78, 236 కేసులు నమోదవ్వగా..33,356 అత్యాచార కేసులు ఉన్నాయని తెలిపింది. 2017లో 32,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాదికాఏడాది మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి.

ఐపిసి సెక్షన్‌ కింద నమోదౌత్ను ఈ కేసుల్లో అధికంగా..భర్త లేదా అత్తంటివారి వేధింపులకు బలౌతున్న వారు 30.9 శాతంగా ఉండగా, మహిళ అనే తేలిక భావంతో మహిళలపై జరిగే దాడులు 21.8 శాతం నమోదయ్యాయి. కిడ్నాప్‌, అపహరణ వంటివి 17.9 శాతం కేసులు నమోదయినట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలో తేలింది. ఒక్క మహిళలపై కాకుండా ఆడపిల్లలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఈ నివేదిక బయటపెట్టింది.

2018 కన్నా 2019లో 4.5 శాతం నేరాలు పెరిగినట్లు చెబుతోంది. 2019లో చిన్నారులపై నమోదైన అఘాయిత్యాలు సంఖ్య. 1.48 లక్షలు. వీటిలో కిడ్నాప్‌ కేసులు 46.6 శాతం కాగా, లైంగిక దాడులు, వేధింపులు 35.3 శాతంగా ఉన్నాయి. కాగా, తాజా గణాంకాల్లో పశ్చిమ బెంగాల్‌ వివరాలు లేవని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు