ఆ కేసు పెట్టారు.. గర్భం నా వల్ల కాదని చెప్పాడు.. చివరికి డీఎన్ఏ టెస్టులో..?

శనివారం, 21 నవంబరు 2020 (14:19 IST)
చెన్నైలో ఓ యువతికి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఒక అబ్బాయిపై కక్షతో రేప్ కేసు పెట్టి, అతనిని మానసిక క్షోభకు గురిచేసిన కేసు నుంచి సదరు యువకుడికి చెన్నైలోని న్యాయస్థానం విముక్తినిచ్చింది. అంతేకాకుండా, పరువు నష్టంగా సదరు యువకుడికి కేసు పెట్టిన అమ్మాయి కుటుంబం నుంచి 15 లక్షల పరిహారం కూడా ఇప్పించింది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సంతోష్‌తో ఆ యువతి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. ఆ యువతి గర్భం దాల్చడంతో ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పారు.
 
అయితే, తనకేమీ తెలియదని, ఆమెతో తాను ఎన్నడూ సన్నిహితంగా లేనని సంతోష్ తెలిపాడు. అయినప్పటికీ యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో 2009 నవంబరులో అరెస్టయిన సంతోష్ 95 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడు. 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ లోగా అతడిపై కేసు పెట్టిన యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. 
 
అనంతరం ఆ పాపకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా, ఆమె తండ్రి సంతోష్ కాదని తేలింది. 2016, ఫిబ్రవరి 10న న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది. అనంతరం తనపై అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఆ యువకుడు పరువు నష్టం దావా వేశాడు. రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు