బాధితులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్‌మెన్ కుటుంబ సభ్యులకు కేజ్రీవాల్ రూ. 1 కోటి సాయం

బుధవారం, 19 ఆగస్టు 2020 (19:13 IST)
ఢిల్లీలోని పీరాగార్హి ప్రాంతంలో భవనం కూలిపోవడంతో ప్రజలను రక్షించే సమయంలో ఈ ఏడాది జనవరిలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళం దివంగత శ్రీ అమిత్ కుమార్ బాల్యాన్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కలిశారు. ఆపదలో వున్నవారిని రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన అమిత్ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయంగా చెక్ అందజేశారు.
 
మరణించిన ఫైర్‌మెన్ కుటుంబ సభ్యునికి ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని ఈ ఏడాది ఆరంభంలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. చెక్ అందించిన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ... అమిత్ కుటుంబానికి కష్టకాలంలో ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక సహాయం ఆదుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
 
సిఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ట్వీట్ చేస్తూ, "ఢిల్లీ ఫైర్ సర్వీసులో పనిచేసిన అమిత్ కుమార్ ప్రజల ప్రాణాలను ధైర్యంగా కాపాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ ఆయన త్యాగానికి నమస్కరిస్తుంది. ఈ రోజు తన కుటుంబ సభ్యులతో సమావేశమై వారికి రూ. 1 కోటి సహాయం అందించాను. ఈ మొత్తంతో కుటుంబానికి కొంత సహాయం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను."
 
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు, "అమిత్ బాల్యాన్ ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తున్నక్రమంలో తన జీవితాన్ని కోల్పోయారు. కోల్పోయిన ప్రియమైన వ్యక్తిని తిరిగి తీసుకురాలేము, కానీ ఢిల్లీ ప్రభుత్వం తన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం చేసింది. మనం చేయగలిగింది అతి తక్కువే అయినా వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆశిస్తున్నా." అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు