మరింతగా క్షీణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

సోమవారం, 31 ఆగస్టు 2020 (12:20 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరితంగా క్షీణించింది. తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ... ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 
 
తొలుత కరోనా వైరస్ బారినపడిన ఆయనను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ నిర్వహించారు. అదేసమయంలో, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఆదివారం నుంచి ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆసుపత్రి తాజా బులెటిన్‌లో తెలిపింది. 
 
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన బీపీ ప్రమాదకరస్థాయిలో తగ్గిపోయిందని వివరించింది. ప్రణబ్‌కు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపింది. ఆయన ఇప్పటికీ డీప్ కోమాలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. 
 
ఆస్పత్రి నుంచి షా డిశ్చార్జ్ 
ఇదిలావుంటే, కరోనా వైరస్‌ను జయించి, ఆపై అనారోగ్యం బారినపడిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన అమిత్ షాకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. ఆపై ఆయన నిపుణుల సూచనతో గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ చేరి, 12 రోజుల చికిత్స అనంతరం 14న ఇంటికి వెళ్లారు.
 
ఆపై ఆయన తీవ్రమైన అలసట, ఒళ్లునొప్పులు బారిన పడటంతో మళ్లీ 18వ తేదీన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలోని అత్యుత్తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా పూర్తి అరోగ్యంగా ఉన్నారని, అందువల్ల డిశ్చార్జ్ చేశామని అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు