అన్నదాతల ఆందోళన : పట్టించుకోని కేంద్రం - రహదారుల నిర్బంధానికి పిలుపు

గురువారం, 10 డిశెంబరు 2020 (11:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతన్నలు సాగిస్తున్న ఆందోళన గురువారానికి మూడో రోజుకు చేరింది. తమ ఆందోళనపై ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. 
 
ఇందులో భాగంగా డిసెంబర్‌ 12న ఢిల్లీ - జైపూర్‌, ఢిల్లీ - ఆగ్రా రహదారులను దిగ్బంధించాలని, దేశవ్యాప్తంగా రహదారులపై టోల్‌ ఫీజు చెల్లించకూడదని పిలుపునిచ్చారు. ఈనెల 14న దేశవ్యాప్తంగా మరోమారు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఆరోజున ఉత్తర భారత రైతులంతా చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని, దక్షిణ భారత రైతులు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. 
 
కాగా, కేంద్రం తయారు చేసిన ఈ కొత్త చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ పేరుతో ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసి ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలు సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌, నోయిడా సహా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో రైతులు బైఠాయించిన రహదారులను పోలీసులు మూసివేశారు. 
 
కాగా, మూడు వ్యవసాయ చట్టాల్లో ఏడు సవరణలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈమేరకు బుధవారం ఓ ముసాయిదాను సిద్ధంచేసి 13 రైతు సంఘాలకు పంపింది. అయితే, ఈ ముసాయిదాను రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాలను రద్దుచేయాల్సిందేనంటూ మంకుపట్టుపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు