ఆరోగ్య వన్ - సర్దార్ పటేల్ జూను ప్రారంభించిన ప్రధాని మోడీ

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:47 IST)
రెండు రోజుల పర్యటన కోసం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారమంతా బిజీ బిజీగా గడిపారు. తొలుత ఇటీవల మృతి చెందిన తన రాజకీయ గురువు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
 
ఆ తర్వాత నర్మదా జిల్లాలోని కెవాడియాలో 'ఆరోగ్య వన్' ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆ ఉద్యానవనంలో కలియదిరిగారు. 'ఆరోగ్య వన్' పార్కులో వందల సంఖ్యలో ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఈ మొక్కలు, మూలికల గురించిన పూర్తి సమాచారాన్ని కూడా పార్కులో అందుబాటులో ఉంచారు.
 
అలాగే, ఏక్తా మాల్‌ను, చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కును ఆయ‌న రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభించారు. పార్కులో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నారు. పార్కు విశేషాలను వారు మోడీకి వివరించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్డౌన్ విధించాక మోడీ గుజరాత్ రావడం ఇదే ప్రథమం.
 
అంతేకాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఆయన పాల్గొన్నారు. తాజాగా న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియాలో స‌ర్దార్ ప‌టేల్ జూలాజిక‌ల్ పార్కును ప్రారంభించారు. జంగిల్ స‌ఫారీగా పేరొందిన ఈ ప్రాంతాన్ని గుజ‌రాత్ స‌ర్కారు జూలాజిక‌ల్ పార్కుగా తీర్చిదిద్దింది. అనంత‌రం ఆ పార్కులోని టూరిస్టు వాహ‌నంలో ప్ర‌యాణిస్తూ జూలో జంతువులు అన్నింటిని వీక్షించారు. 
 
ఆ త‌ర్వాత‌ జూపార్కులోని ప‌క్షి ప్ర‌ద‌ర్శ‌న కేంద్రాన్ని ప్ర‌ధాని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొద్ది సేపు రెండు రామ చిలుక‌ల‌తో కాల‌క్షేపం చేశారు. శ‌నివారం కూడా ప్ర‌ధాని గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు