యూపీలో మరో యువతిపై సామూహిక అత్యాచారం

గురువారం, 1 అక్టోబరు 2020 (11:23 IST)
అత్యాచారాలు, హత్యలకు బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ అడ్డాగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ ఘటన తరహాలో మరో దురాగతం బయటపడింది.

22 ఏళ్ల దళిత యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేయడంతో... తీవ్ర గాయాలపాలై బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హథ్రాస్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్‌రామ్‌పూర్‌ అనే ప్రాంతంలో జరిగింది.

తీవ్రంగా గాయపడిన యువతిని లక్నో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా... ఆమెకు మత్తు మందు ఇచ్చారని, ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రిపోర్టులో తేలింది.

ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మైనర్‌ అని యువతి సోదరుడు తెలిపారు. పని నిమిత్తం బయటకు వెళ్లిన యువతి... ఇంటికి చేరుకోకపోవడంతో, కంగారు పడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి ఏడు గంటల సమయంలో తన కుమార్తె ఇంటికి వచ్చిందని చెప్పారు. ఆమెను... నిందితులు రిక్షాలో తీసుకొచ్చి.. ఇంటి దగ్గర వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. మత్తు పదార్థాలు ఇవ్వడంతో కుమార్తె స్పృహలో లేదని, తీవ్రంగా గాయపడి, నిలబడని స్థితిలో ఉందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

'నన్ను రక్షించండి.. నేను చనిపోవాలనుకోవడం లేదంటూ' ఆ యువతి ఆక్రందన చేసిందని చెప్పారు. ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే తన కడుపులో మంటలా రావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉందని, లక్నోలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించగా, బలరామ్‌పూర్‌ నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారని చెప్పారు.

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. హథ్రాస్‌ ఘటన మాదిరి దీన్ని కూడా యోగి సర్కార్‌ కప్పిపుచ్చుకునే ప్రయ్నతం చేయవద్దని సూచించారు. 'హథ్రాస్‌ ఘటన తర్వాత, బల్‌రామ్‌పూర్‌లో మరో సామూహిక అత్యాచార ఘటన జరిగింది.

ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలపాలై.. మృత్యుఒడికి చేరింది. హథ్రాస్‌ ఘటన తరహాలోనే ఈ ఘటనను కప్పిపుచ్చుకోకుండా.. నిందితులపై తక్షణం విచారణ చేపట్టాలి' అని ట్వీట్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు