ప్రధాని క్రేజ్ ఏమైంది..? మోదీ ''మన్ కీ బాత్" ఎపిసోడ్‌కు డిస్‌లైకులు

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:33 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత్‌లో ప్రధాని మోదీతో పోల్చుకుంటే చాలా వెనకబడి వున్నారు. మోదీకి సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలో కనిపించినా అదో ట్రెండ్‌లా వైరల్ అవుతుంటుంది. లైకులు, కామెంట్లు లక్షల్లోనే వుంటాయి. 
 
కానీ తాజాగా నిర్వహించిన 'మన్‌ కీ బాత్' ఎపిసోడ్ మోదీ ట్రెండ్‌కు బ్రేక్ వేసిందా అనే అనుమానాల్ని కల్పిస్తోంది. మోదీకి సంబంధించిన వీడియో, ఇమేజ్, మరేదైనా పోస్టు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిందంటే లైకులతో దూసుకుపోతుంది. కానీ తాజాగా మన్ కీ బాత్ ఎపిసోడ్‌ 10 లక్షల డిస్‌లైకులతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ డిస్‌లైకులు వచ్చింది కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన యూట్యూబ్‌ ఛానల్‌లో కావడం గమనార్హం.
 
ఆగస్టు నెలకు సంబంధించిన 'మన్‌ కీ బాత్' కార్యక్రమం ఆగస్టు 30న జరిగింది. ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వీడియోను భారతీయ జనతా పార్టీ అధికారిక యూట్యూబ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. అయితే ఈ వీడియోకు ఎన్నడూ లేనంతగా డిస్‌లైకులు వచ్చాయి. ఈ వీడియోకు వచ్చిన డిస్‌లైకులతో పోల్చుకుంటే లైకులు మూడవ వంతు కూడా లేవు. అంతే కాకుండా పీఎంవోఇండియా, నరేంద్రమోదీ యూట్యూబ్‌ చానళ్లలో కూడా లైకుల కంటే ఎక్కువ డిస్‌లైకులే వచ్చాయి.
 
ఇక, పీఎంవో ఇండియా యూట్యూబ్‌లో అయితే కామెంట్లు కనిపించకుండా టర్న్ ఆఫ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మోదీపై ఎన్నడూ లేని వ్యతిరేకతను తాజా మన్‌ కీ బాత్‌పై దేశ ప్రజలు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు