మారటోరియం పొడిగింపు కుదరదు: ఆర్బీఐ

సోమవారం, 12 అక్టోబరు 2020 (07:31 IST)
రుణాల చెల్లింపును వాయిదా వేస్తూ ఇచ్చే మారటోరియంను ఆరు నెలలకు మించి పొడిగించడం కుదరదని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.

కరోనా కారణంగా వివిధ రంగాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో రుణాల పునర్‌వ్యవస్థీకరణపై కె.వి.కామత్‌ కమిటీ చేసిన సిఫార్సులను, మారటోరియంపై ఇచ్చిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లను సమర్పించాలని ఈ నెల అయిదో తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ వివరాలతో పాటు మారటోరియం పొడిగింపుపై రిజర్వు బ్యాంకు తన అభిప్రాయాలను తెలిపింది. వడ్డీలను మాఫీ చేయడం కుదరదని ఇంతకుముందే ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణాల చెల్లింపును దీర్ఘకాలంపాటు వాయిదా వేయలేమని ఇప్పుడు చెబుతూ అలా చేస్తే క్రమశిక్షణ అదుపు తప్పుతుందని పేర్కొంది.

కరోనా సమయంలో చెల్లించని రుణాలను మొండి బకాయిలు కింద పరిగణించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స్టే ఉత్తర్వును తక్షణమే ఎత్తివేయాలని, లేకుంటే బ్యాంకింగ్‌ రంగంపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని రిజర్వు బ్యాంకు తెలిపింది.
 
మరిన్ని రాయితీలు సాధ్యం కాదు: కేంద్రం 
కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్‌ జైన్‌ ప్రమాణ పత్రం సమర్పించారు. ఇంకా రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు