చైనా కంపెనీలకు షాక్.. రహదారుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి నో

బుధవారం, 1 జులై 2020 (18:02 IST)
చైనా కంపెనీలకు కేంద్రం మరోమారు షాకిచ్చింది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి చేసిన దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రజలు చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 59 రకాల చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. వీటికి ప్రతిగా చైనా దేశంలో భారత వెబ్‌సైట్లు, పత్రికలపై నిషేధం విధించింది. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చేపడుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను కానీ, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కానీ అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 
 
ఎంఎస్ఎంఈ కంపెనీల్లో కూడా చైనాను అనుమతించబోమని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కంపెనీలు భాగస్వామిగా ఉన్న జాయింట్ వెంచర్లను కూడా అనుమతించబోమన్నారు. ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
జాతీయ రహదారులకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని... మన దేశ కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్నట్టైతే... రీబిడ్డింగ్ నిర్వహిస్తామన్నారు. 
 
మన దేశానికి విదేశీ టెక్నాలజీ అవసరమైన సందర్భాల్లో కూడా చైనా పెట్టుబడిదారులను అనుమతించబోమన్నారు. చైనా నుంచి వస్తున్న దిగుమతులపై చెన్నై, విశాఖపట్నం పోర్టుల్లో కస్టమ్స్ నిఘాను ముమ్మరం చేశామని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు