కాశ్మీర్‌ను విడిచి వెళ్లండి... ఎయిర్‌పోర్టుకు క్యూ... శ్రీనగర్‌లో చిక్కుకున్న తెలుగువారు...

శనివారం, 3 ఆగస్టు 2019 (13:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కాశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాశ్మీర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు తక్షణం ఈ ప్రాంతాన్ని వీడి తమతమ స్వస్థాలకు వెళ్లిపోవాలంటూ స్థానిక యంత్రాంగం ఆదేశాలుజారీ చేసింది. దీంతో శ్రీనగర్‌లోని ఎయిర్‌పోర్టుకు క్యూకట్టారు. అదేసమయంలో శ్రీనగర్‌లో తెలుగువారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
 
అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రేరేపిత జైషే మొహ్మద్ తీవ్రవాదులు దాడికి పాల్పడవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో ఈ యాత్రను కేంద్రం అర్థాంతరంగా రద్దు చేసింది. పైగా, యాత్ర నుంచి భక్తులు తిరిగి వచ్చేయాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు వెంటనే స్వస్థలాలకు వెళ్లిపోవాలని అక్కడి పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది.
 
ఫలితంగా శ్రీనగర్ నిట్ కాలేజీతో పాటు వందలాది సంఖ్యలో పర్యాటకులంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం రద్దీగా మారిపోయింది. అయితే అదే సంఖ్యలో విమానాలను ఎయిర్ లైన్స్ కంపెనీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలంతా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.
 
మరోవైపు, ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్‌కు కేంద్రం అదనపు బలగాలను తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న బలగాలతో పాటు.. మరో 35 వేల మంది బలగాలను మొహరించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆర్టికల్ 35ఏ ను తొలగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని కాశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. 
 
ఇకోవైపు, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొనే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో కాశ్మీర్ ప్రజలు ఏటీఎంలు, పెట్రోల్ బంకులు, నిత్యావసర వస్తువుల షాపుల ముందు క్యూ కట్టారు. కొన్ని నెలల పాటు కావాల్సిన సరుకులను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొరత కూడా ఏర్పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు