కార్యాలయాలలో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆదివారం, 7 జూన్ 2020 (09:29 IST)
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 5.0 లాక్‌ డౌన్‌ అమలవుతోంది. అయినప్పటికీ ఆఫీసులు, ఇతర పని ప్రదేశాల్లో (వర్క్ ప్లేసుల్లో) సాధ్యమైనంత వరకు వర్క స్టేషన్లు, కారిడార్లు, ఎలివేటర్లు, పార్కింగ్ ప్రదేశాలు, సమావేశపు గదులల్లో ఉద్యోగులు దగ్గరగా ఉండడంవల్ల కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు.
 
కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. ఫేస్ కవర్లు / మాస్కులు వాడటం తప్పనిసరి. సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచూ చేతులు కడుక్కోవడం ప్రాక్టీస్ చేయండి. మీ చేతులు మురికిగా కనిపించకపోయినా శుభ్రం చేసుకోండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ (కనీసం 20 కి
సెకన్లు) శుభ్రం చేసుకోవాలి.
 
దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ను ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
ఉద్యోగులందరూ వారి ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఉమ్మివేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఉద్యోగులు అందరూ ఆరోగ్యసేతు యాప్‌ ఇన్స్టాల్ చేయడంతోపాటు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. 

కార్యాలయాల దగ్గర నిర్దిష్టమైన నివారణ చర్యలు:
ప్రతి ప్రవేశమార్గంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ వ్యవస్థ ఉండాలి.
లక్షణాలు కనిపించని ఉద్యోగులు/ సందర్శకులను మాత్రమే లోపలికి అనుమతించాలి.

ఒకవేళ కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఎవరైనా ఉన్నట్టయితే వారు ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఆ  సిబ్బంది ఆఫీసుకు రాకూడదు. అలాంటి ఉద్యోగులందర్నీ ఇళ్లనుంచే పనిచేసేందుకు అనుమతించాలి. దాన్ని సెలవుల కింద ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదు.
 
అధికారుల వాహనాలు నడిపే డ్రైవర్లుకూడా భౌతికదూరం పాటించాలి.  ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి.  
 
ఒకవేళ డ్రైవర్లు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నివసిస్తున్నట్టయితే డ్రైవర్లను విధులకు దూరంగా ఉండాలని సర్వీసు ప్రొవైడర్లు/ ఆఫీసర్లు / స్టాఫ్ సూచించాలి.
 
వాహనాలను 1% సోడియం హైపోక్లోరైట్‌తో నిత్యం శుభ్రం చేయాలి. స్టీరింగ్‌, డోర్లు, హ్యాండిల్స్‌, తాళాలుకూడా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి.
 
ఉద్యోగుల్లో వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలున్నవారు ఉంటే వారిని ప్రజలతో నేరుగా సంబంధం ఉండేచోట ఉంచకూడదు. ఇలాంటి ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేలా చూడాలి.
 
అధికారులు/ సందర్శకులతోపాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. అలాంటి వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ఆఫీసు పరిసరాల్లో అన్ని సమయాల్లో మాస్క్ ధరించి ఉండాలి.
 
రోజువారీగా వచ్చే సందర్శకులను నియంత్రించాలి. తాత్కాలికంగా విజిటర్స్ ను నిలిపివేయాలి. ఒకవేళ ముఖ్యమైన పనిమీద వస్తే.. తగిన అనుమతి ఉంటేనే ఉన్నతాధికారిని కలవడానికి ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనుమతించాలి.
 
సమావేశాలు వీలైనంతమేర వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారానే కొనసాగించాలి. కోవిడ్-19 గురించి, నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లు/ స్టాండీలు ఏర్పాటు చేయాలి. వైరస్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా ఆడియో, వీడియో క్లిప్ లు ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలి.
 
ఆఫీసు పనివేళలు, మధ్యాహ్న భోజనం, టీ విరామాల సమయం దశలవారీగా అమలుచేయాలి. పార్కింగ్, బయటి ప్రదేశాల్లో గుంపులుగా ఉండకూడదు. తప్పని సరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
 
వ్యాలెట్‌ పార్కింగ్‌ ఉన్నట్లయితే.. వాహనాలను తీసుకెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు, గ్లౌజ్‌లు, ఫేస్‌ షీల్డ్‌ను ధరించాలి. కారు తాళం చెవులు, స్టీరింగ్‌, గేర్‌పై డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ర్పే చేయాలి. వాష్ రూమ్స్ లో హ్యాండ్ శానిటైజర్లు, సబ్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.
 
ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో తరచూ తాకే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు పనిచేసే చోట భౌతిక దూరం పాటించేలా సీటింగ్ విధానం ఉండాలి. ఆఫీసులోకి వెళ్లేందుకు అధికారులు, స్టాఫ్, విజిటర్లకు ప్రత్యేకంగా ఎంట్రీ ఉండాలి.
 
లిఫ్టులలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా వ్యక్తుల సంఖ్యను తగ్గించాలి. ఏసీల వినియోగం ఉంటే.. కేంద్రం ఇంతకు ముందు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య, గాలిలో తేమ 40-70శాతం మధ్య ఉండేలా చూడాలి.
 
ఆఫీసులో కోవిడ్-19 కేసు నమోదైతే తీసుకోవాల్సిన చర్యలు:
ఆఫీసుల్లో ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కోవిడ్ కేసులు నమోదు కావని చెప్పలేము. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ కింద ఇవ్వబడిన చర్యలు తీసుకోవాలి.
 
కార్యాలయాల్లో ఎవరైనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే   అతను/ ఆమెను రూమ్ లో ఉండే వ్యక్తుల నుంచి వేరు చేసి వెంటనే ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి.
 
అతను/ ఆమెను డాక్టర్ పరీక్షించే వరకు మాస్కు/ ఫేస్ కవర్ ఇవ్వండి. వెంటనే స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి లేదా జిల్లా, రాష్ట్రస్థాయి హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి
 
ఆఫీసును మూసివేయడం:
1-2 పాజిటివ్‌ కేసులు బయటపడితే క్రిమిసంహారం చేసే విధానం తక్కువగా ఉంటుంది. కేవలం ఆ వ్యక్తి 48 గంటల్లో తిరిగిన ప్రదేశాలను శుభ్రం చేస్తే సరిపోతుంది.  మొత్తం ఆఫీసు భవనాన్ని మూసేయాల్సిన అవసరం లేదు.
 
ఒకవేళ ఎక్కువ కేసులు వస్తే మొత్తం భవనాన్ని/ బ్లాకును 48 గంటలపాటు మూసేసి సంపూర్ణంగా శుభ్రం చేయాలి. ఆ పని పూర్తయ్యేంతవరకూ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాలి.
 
ఒకవేళ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల్లో రెండు రోజుల్లో ఏవైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే కనీసం 14 రోజులు క్వారెంటైన్‌కు వెళ్లాలి
 
... డాక్టర్ అర్జా శ్రీకాంత్ 
కోవిడ్-19 ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు