కోవిడ్ రూల్స్ బ్రేక్ : కుటుంబానికి రూ.6 లక్షలు అపరాధం

ఆదివారం, 28 జూన్ 2020 (13:34 IST)
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏ కుటుంబానికి అధికారులు ఏకంగా ఆరు లక్షల రూపాయల మేరకు అపరాధం విధించారు. కోవిడ్ రూల్స్ అమల్లో ఉన్న సమయంలో పెళ్లి నిర్వహించాడు. ఈ పెళ్లికి 50 మంది వరకు అతిథులు హాజరయ్యారు. వీరిలో 15 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు ఆ కుటుంబానికి ఏకంగా రూ.6 లక్షల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడికి వివాహం జరిపించాడు. కరోనా కారణంగా పెళ్లికి 50 మంది అతిథులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా, నిబంధనలు పక్కనపెట్టి గీసులాల్ ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. 
 
ఈ వివాహానికి హాజరైన వారిలో 15 మందికి మహమ్మారి సోకినట్టు ఆ తర్వాత నిర్ధరణ అయింది. వీరిలో ఒకరు చనిపోయారు కూడా. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు.
 
అలాగే, కరోనా సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. వీరికి కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్‌ తదితర వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది. 
 
దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మొత్తాన్ని వసూలుచేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు