రాజీవ్ హత్య కేసు ముద్దాయి నళిని ఆత్మహత్యాయత్నం!!

మంగళవారం, 21 జులై 2020 (11:19 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఉంటున్న వేలూరు కేంద్ర కారాగారంలో ఆమె ఈ పనికిపాల్పడింది. 
 
రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని శ్రీహరన్ గత 29 యేళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తోంది. నిజానికి ఆమెతో పాటు.. మిగిలిన దోషులందరికీ ఉరిశిక్షపడింది. కానీ, రాజీవ్ సతీమణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వినతిమేరకు దోషులకు ఉరిశిక్షలను రద్దు చేసి, దాన్ని జీవితకారాగారశిక్షలుగా మార్చారు. 
 
అయితే, జీవితకాల శిక్ష 14 యేళ్లు మాత్రమే. కానీ, రాజీవ్ హత్య కేసులోని ముద్దాయిలు గత 29 యేళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరి విడుదల కోసం న్యాయపోరాటం చేయగా, వారి విడుదలను రాష్ట్ర గవర్నర్‌ నిర్ణయాధికారానికి కట్టబెడుతూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. 
 
ఈ నేపథ్యంలో నళిని శ్రీహరన్ వేలూరు మహిళా జైలులో సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె లాయర్ పుహళేంది తెలిపారు. గమనించిన జైలు అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
గత కొంతకాలంగా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల తన కుమార్తె వివాహం కోసం పెరోల్‌పై ఆర్నెల్లపాటు బయటకు వచ్చారు. పెరోల్ ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు.
 
ఈ పరిస్థితుల్లో జైలులోని తోటి ఖైదీలకు, నళికి మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి తీసుకెళ్లిందని పుహళేంది తెలిపారు. ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొన్నారు. 
 
అయితే, గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు. విషయం తెలిసిన నళిని భర్త తనను పిలిచి ఆమెను పుళల్ జైలుకు తరలించేలా చూడాలని కోరారని, త్వరలోనే ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు