బడుగుల సమస్యలపై మడమతిప్పని పోరాటం : పాశ్వాన్ మృతిపై నేతల సంతాపం

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:18 IST)
కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి చనిపోయారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అధినేతలు తీవ్ర సంతాపం తెలిపుతూ సందేశాలు విడుదల చేశారు. 
 
కాగా, రాంనాథ్ కోవింద్ విడుదల చేసిం సంతాప సందేశంలో పాశ్వాన్ మృతితో దేశం ఒక గొప్ప దార్శనికత ఉన్న నాయకుడ్ని కోల్పోయిందన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా క్రియాశీలక సేవలు అందించిన వారిలో పాశ్వాన్ ఒకరని కొనియాడారు. బలహీన వర్గాల తరఫున బలంగా గళం వినిపించారని, బడుగు వర్గాల సమస్యలపై మడమతిప్పని పోరాటం చేశారని కీర్తించారు.
 
యువతలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సోషలిస్టు అని, ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి మహోన్నతుల మార్గదర్శకత్వంలో ఎదిగారని గుర్తుచేశారు. పాశ్వాన్‌కు ప్రజలతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎల్లప్పుడూ వారి సంక్షేమం తప్ప మరేమీ పట్టదన్నట్టుగా వ్యవహరించేవారన్నారు. ఈ విషాద సమయంలో పాశ్వాన్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన సందేశంలో... పాశ్వాన్ కఠోర శ్రమ, పట్టుదలతోనే రాజకీయాల్లో ఎదిగారని, కుర్రాడిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ దిగ్గజాలతో పోరాడిన ధీరుడు అని అభివర్ణించారు. అద్భుతమైన పార్లమెంటు సభ్యుడు, మంత్రి అంటూ కొనియాడారు. అనేక రంగాల్లో చిరస్మరణీయ సేవలు అందించారని కీర్తించారు.
 
పాశ్వాన్‌తో భుజం భుజం కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. కేబినెట్ సమావేశాల్లో ఆయన ప్రతిపాదనలు ఎంతో దూరదృష్టితో కూడినవని కితాబునిచ్చారు. పాశ్వాన్ రాజకీయ మేధస్సు, రాజనీతిజ్ఞత, పాలన దక్షత ఉన్నతమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సంతాపం తెలుపుకుంటున్నట్టు మోడీ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు