మద్యాన్ని డోర్ డెలివరీ చేయండి : రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన

శుక్రవారం, 8 మే 2020 (17:37 IST)
దేశంలో సాగుతున్న మద్యం విక్రయాలపై జోక్యం చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిరాకరించింది. పైగా, మద్యం విక్రయాలు అనేది రాష్ట్ర ప్రభుత్వా విధానపరమైన నిర్ణయమని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అదేసమయంలో డోర్ డెలివరీ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలకు సూచన చేసింది. 
 
కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తూ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అయితే, కేంద్రం ఇటీవల లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. ముఖ్యంగా, మద్యం షాపులు తెరిచి, విక్రయాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో లిక్కర్ షాపులకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మద్యం కొనుగోళ్ల సమయంలో భౌతికదూరాన్ని కూడా పాటించడం లేదని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
 
ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు... కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాలు రాష్ట్రాల విధానపరమైన నిర్ణయాలని... అమ్మకాలను తాము నిషేధించలేమని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలకు ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని... ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికి డోర్ డెలివరీ చేయాలని సూచన చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు