శతాధిక దంపతులు ఒకే సారి కన్నుమూశారు.. ఎక్కడ?

బుధవారం, 13 నవంబరు 2019 (16:08 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. శతాధిక దంపతుల జోడి ఒకేసారి తనువు చాలించింది. మనుమలు, మనుమరాండ్లు, మునిమళ్లను కూడా చూసిన ఆ జంట... ఒకేసారి చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు, ఆ గ్రామంలోనే విషాదఛాయలు అలముకున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కుప్పకూడి గ్రామానికి చెందిన వెట్రివేల్ (104), పిచాయి (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనుమరాండ్లు, మునిమనుమళ్ళు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చున్న పిచాయి కన్నీరు పెడుతూ మూర్ఛపోయింది. 
 
దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు విడినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 80 యేళ్ళ వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు