భర్త నలుపు రంగులో ఉన్నాడని పెట్రోల్‌తో తగలబెట్టేసింది!

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అతనిపై పెట్రోల్ పోసి తగలెట్టేసింది. ఈ అమానుష ఘటన గత సోమవారం రోజున జరిగింది, అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరికి 5 నెలల పాప కూడా ఉంది. 
 
చూడటానికి అందంగా ఉండే ప్రేమ్‌శ్రీ తన భర్త నల్లగా ఉన్నాడంటూ బాధపడేది. ఎప్పుడూ అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవకు దిగేది. ఇది సాధారణ విషయంగానే కుటుంబసభ్యులు భావించారు. అయితే ప్రేమ్‌శ్రీ ఎవరూ ఊహించని ఘాతుకానికి పాల్పడింది. భర్త నలుపు రంగులో ఉండటాన్ని తట్టుకోలేని ప్రేమ్‌శ్రీ నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. 
 
తీవ్ర గాయాలపాలైన సత్యవీర్‌సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన సత్యవీర్‌సింగ్ సోదరుడు హర్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రేమ్‌శ్రీ కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు