రథసప్తమి.. పుణ్యస్నాన ముహూర్తం.. పూజా విధానం ఎలాగంటే?

శుక్రవారం, 31 జనవరి 2020 (18:21 IST)
రథసప్తమి పండుగ శనివారం (ఫిబ్రవరి 1, 2020) వస్తోంది. సప్తమి తిథి జనవరి 31, 2020 ఉదయం 03:51 గంటలకు ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 1, 2020 శనివారం సాయంత్రం 06:10 గంటలకు ముగుస్తుంది. ఈ రథ సప్తమి రోజున పుణ్య స్నానానికి ఫిబ్రవరి 1, శనివారం ఉదయం 05.24 గంటల నుంచి 07.10 నిమిషాల వరకు ముహూర్తం వుందని పండితులు సూచిస్తున్నారు. 
 
రథసప్తమి సూర్యదేవుని పండుగ. ఆరోజున ఈ లోకానికి వెలుగును ఇచ్చే భగవంతుడైన సూర్యునికి పుట్టినరోజు. మాఘమాసంలో వచ్చే సప్తమితిథిని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యదేవుడు ఈ లోకానికి వెలుగును ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజును సూర్య జయంతిగానూ పిలుస్తారు. అందుకే రథ సప్తమి రోజున సూర్యుడిని పూజించి, స్తుతించి, ఉపవసించేవారికి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
రథసప్తమి పూజతో పూర్వజన్మల పాపాలు హరించుకుపోతాయి. రథసప్తమి రోజున అరుణోదయంలో స్నానమాచరించాలి. అరుణోదయ కాలంలో పుణ్య తీర్థాల్లో స్నానమాచరించాలి. ఈ అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి ముందు 24 నిమిషాలని అర్థం. సూర్యోదయానికి ముందే స్నానం చేయడమే దీని అర్థం. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు హరించుకుపోతాయి. 
 
రథ సప్తమి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ రోజున పుణ్య నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానానికి అనంతరం అర్ఘ్యదానాలు చేస్తారు. అటు పిమ్మట స్వచ్ఛమైన నెయ్యితో దీపమెలిగించి.. ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తారు. పూజకు ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయి. 
 
సూర్యదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. సూర్యదేవుడు బంగారు రథంపై ఆసీనుడై.. ఏడు తెలుగు గుర్రాలతో స్వారీ చేస్తూ వుంటాడు. దేశ వ్యాప్తంగా ఈ రోజును పండగ చేసుకుంటారు. సూర్యదేవుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇంట పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రీ మంత్రంతో, సూర్య గాయత్రీతో, ఆదిత్య హృదయంతో సూర్యుడిని స్తుతిస్తారు. సూర్యాష్టకం, సూర్య సహస్రనామాలతో రథ సప్తమి రోజున సూర్యుడిని పూజించిన వారికి సకల శుభాలు, భోగభాగ్యాలు చేకూరుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు