రథసప్తమి.. ఆదిత్య హృదయం పఠిస్తే.. సూర్యారాధన చేస్తే?

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:32 IST)
రథ సప్తమి శ్రీ సూర్యనారాయణ స్వామి పండుగ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లిలో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోకి వస్తుందనే నమ్మకం. శీతాకాలం ఆగిపోతుంది.  వసంతకాలం ప్రారంభమవుతుంది. మన శరీరాలు సూర్యకిరణాలతో రసాయన ప్రతిచర్యను కలిగి ఉంటాయి.
 
రావణుడిని చంపడానికి ముందు రాముడు సూర్యుడిని ఆరాధించాడు. రామ రావణ యుద్ధ సమయంలో అలసిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయంను 30శ్లోకాలుగా ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఈ శ్లోకాలను పఠించినవారికి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. ఆదిత్యుని ఆరాదిస్తే.. తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయని పెద్దల నమ్మకం. సూర్యుడిని రథ సప్తమి రోజున ఆరాధించడం ద్వారా ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా అన్ని రకాల పాపాలను వదిలించుకోవచ్చు. 
 
సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. 
 
ఈ జన్మలో చేసిన .. గత జన్మలో చేసిన.. మనస్సుతో.. మాటతో. శరీరంతో.. తెలిసీ.. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడవడం ఆచారంగా వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు