బ్రహ్మ ముహూర్త కాలంలో ఏ పని చేయాలి..? ఏ గ్రహాలు ఆ సమయంలో చెడు చేయవట

బుధవారం, 17 ఆగస్టు 2016 (11:00 IST)
బ్రహ్మ ముహూర్త కాలంలో ఏ శుభకార్యాన్నైనా సఫలమవుతుంది. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారో తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవండి. బ్రహ్మీ ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెప్తున్నారు. విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు. 
 
ఉదయం పూట మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చదువుకున్నదంతా చక్కగా గుర్తుంటుంది. రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.
 
అలాగే మహిళలకు ఒత్తిడి లేని, మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అవసరం. బ్రాహ్మి ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే.. ఇంటిపనులన్నీ.. ఆందోళన లేకుండా అయిపోతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి. బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మనపైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మిలో విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది.
 
బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలాంటి బ్రహ్మ పేరుతో వచ్చే ఓ ముహూర్తానికి ఉన్నత స్థానముందనే విషయం తెలిసిందే. బ్రహ్మ మహూర్తం అనేది ఎలా వచ్చిందంటే.. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి.
 
ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో "అండం'' పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మ ముహూర్త కాలమంటారు. 
 
ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడుచేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనదని పండితులు చెప్తుంటారు. ఉదయం 3 గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్త కాలంగా పరిగణిస్తారు. 

వెబ్దునియా పై చదవండి