టిటిడిలో సంస్కరణలు, ధార్మిక సేవలు అమలు బాగున్నాయి: ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్

మంగళవారం, 19 జనవరి 2021 (22:11 IST)
తిరుమల, తిరుపతి దేవస్థానముల ఆద్వర్యంలో జరుగుతున్న ధర్మ ప్రచార పరిషత్ ధార్మిక సేవలు, అమలు చేస్తున్న సంస్కరణలు బాగున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కమిటీ పర్యటనలో భాగంగా రెండవ రోజు శాసన సభ ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్ సభ్యులు మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డిలు, టిటిడి ఇఓ జవాహర్ రెడ్డి, అడిషనల్ ఇఓ ధర్మా రెడ్డి, జెఇఓ బసంత్ కుమార్, ఉన్నతాధికారులతో ప్రివిలేజస్ కమిటీ స్థానిక శ్రీ పద్మావతి అతిధి గృహంలో సమీక్ష నిర్వహించింది.
 
సమీక్షలో ఇఓ, అడిషనల్ ఇఓ, జెఇఓలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టిటిడి విశేషాలు, అమలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు, సంస్కరణలు వివరించారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దర్శన భాగ్యం కల్పిస్తున్నామని కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ మేరకు తీర్థం, శఠారి ప్రారంభించలేదని, మార్చి 20 నుండి దర్శనాలు పూర్తిగా నిలిపివేసి జూన్ 8 నుండి స్థానిక ప్రజలతో తిరిగి దర్శనాలు అంచలంచెలుగా ప్రారంభించామని, కోవిడ్ గైడ్‌లైన్స్ అమలు చేస్తున్నామని వివరించారు.
 
దళారీ వ్యవస్థలో భక్తులు ఇబ్బందులు పడి డబ్బులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతున్న దృష్ట్యా శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నామని తెలిపారు. 
 
సభ్యులు మల్లాది విష్ణు కళ్యాణ మండపాల పునరుద్ధరణ, నిర్మాణాలు చేపట్టాలని, ఎస్.వెంకట చిన్న అప్పలనాయుడు, వి.వరప్రసాద్ రావులు ఎస్.సి. ఎస్.టి కాలనీలో దేవాలయాలు ఏర్పాటుకు ప్రాధాన్యత నివ్వాలని, శిల్పా చక్రపాణి రెడ్డి, ‘గుడికో గోమాత‘ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానానికి అవకాశం కల్పించాలని సూచించారు.
 
ఈ సమావేశ అనంతరం ఛైర్మన్ మీడియాకు వివరిస్తూ టిటిడి అమలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు, సంస్కరణలు బాగున్నాయని, సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నారని, శాసనసభ హక్కుల కమిటీ ప్రజాప్రతినిధుల పర్యటనలో వారి హక్కుకు భంగం కలగకుండా, ఆలయ నియమనిబంధనల మేరకు  సౌకర్యాలు కల్పించాలని సూచించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు