హనుమంతుడి జన్మస్థలం తిరుమలనే.. ఇవిగోండి ఆధారాలు.. టీటీడీ

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (20:12 IST)
వాయుపుత్రుడైన హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు. టీటీడీ పండితులతో ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించిందని తెలిపారు. టీటీడీ దగ్గరున్న ఆధారాలను బయటపెడతామన్నారు. ఆధారాలతో నివేదిక తయారు చేశామన్న ఆయన నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. 
 
కాగా, హనుమ జన్మస్థలం తమదేనని ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ప్రకటించ లేదని, ఇతర రాష్ట్రాలు కూడా ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చని, హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని జవహర్‌రెడ్డి అన్నారు. తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని పండితులు, ఆగమ సలహాదారులు తేల్చారన్నారు. 
 
అలాగే 'హనుమ జన్మస్థలం అంజనాద్రి' పేరిట డాక్టర్‌ ఏవీఎస్‌జీ హనుమథ్‌ ప్రసాద్‌ శ్రీ పరాశర సంహిత గ్రంథం రచించారు. అందులో పచ్చటి కొండల నుదుటిన సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహా తీర్థమే హనుమ జన్మస్థలమని ఆయన తెలిపారు. వేంకటాద్రి పర్వత ప్రాంతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు సైతం వెల్లడిస్తున్నాయి. 
 
వేంకటాచల మహాత్మ్యంలోని భావిశోత్తర పురాణంలో ఆంజనేయుడి జన్మస్థలాన్ని ప్రస్తావించినట్టు వేద పండితులు చెబుతున్నారు. తిరుమల కొండ కృతయుగంలో వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వేంకటాచలంగా పిలువబడుతోందని పురాణాల్లో తెలిపినట్లు పండితులు స్పష్టం చేస్తున్నారు. 
 
త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో భావిశోత్తర పురాణంలో వివరించబడింది. అందులోని మొదటి అధ్యాయం 79వ శ్లోకంలో హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి వివరించారు. అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చింది కాబట్టే వేంకటాద్రికి అంజనాద్రి అనే పేరొచ్చిందని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు