మకర సంక్రాంతి... భోగి పండుగ అంతరార్థం ఏమిటి?

శుక్రవారం, 11 జనవరి 2019 (18:21 IST)
తెలుగువారు ముఖ్యంగా జరుపుకొనే పండుగలలో సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ. దీనిని మనం 3 రోజులు జరుపుకుంటాం. వాటిలో మెుదటి రోజైన భోగినాడు వైష్ణవ ఆలయాలలో గోదా కళ్యాణం అనే కార్యక్రమాన్ని పండుగలా జరుపుకుంటారు. అసలు గోదా కళ్యాణం అంటే ఏమిటి. ఇది భోగినాడే ఎందుకు చేస్తారు. ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది. అనేది మనలో చాలామందికి తెలియదు. ఆ గోదా కళ్యాణం ఇతివృత్తమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 
శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను ఆళ్వారులు అంటారు. వీళ్లలో ముఖ్యమైన వారు 12 మంది. వీరిలో పెరియాళ్వారు అనే ఆయన శ్రీరంగనాధుడికి మహాభక్తుడు. ఈయన అసలు పేరు భట్టనాధుడు. ఈయనే తరువాతి కాలంలో విష్ణుచిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు. విష్ణుచిత్తుడు రంగనాధుడికి ప్రతినిత్యం మాలా కైంకర్యం చేసేవాడు. దీనికోసం ఒక తోటను పెంచి అందులోని రకరకాలైన పూలతో అందంగా మాలలు కట్టి శ్రీరంగడికి సమర్పించేవాడు. 
 
ఒకనాడు విష్ణుచిత్తునికి తులసి మెుక్క గుబురులో ఒక పసిపాప కనిపించింది. అతడు ఆ బిడ్డను తీసుకొని భూ దేవియే ప్రసాదించింది అని తలచి ఆ బిడ్డకు గోదా అని పేరుపెట్టాడు. ఈ గోదాదేవి చిన్నతనంలో తన ఆటపాటలతో ఎక్కువ సమయం గుడిలోనే గడిపేది. ఈమె యుక్తవయస్సుకు రాగానే శ్రీరంగనాధుడి యందు మధురానుభూతి చెందింది. తరువాత ఆమె శ్రీరంగనాధుని చెంత చేరాలని తలచి తన తండ్రి వద్దకు వెళ్లి మానవ కాంత దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని అడుగగా ఆయన ఉన్నాయని చెప్పాడు. 
 
దానికోసం ఒక వ్రతమాచరించ వలసి ఉంటుందని చెప్పగా ఆమె ఆ వ్రత నియమాలను తెలుసుకొని ధనుర్మాసంలో ఆ వ్రతమును ఆచరించడం ప్రారంభించింది. గోదా దేవి ఈ వ్రతమును 30 రోజుల పాటు ఆచరించి తరువాత రోజున శ్రీరంగనాధుడిని వివాహమాడి ఆయనలో ఐక్యమైంది. ఈ కధ ద్వారా జీవాత్మ పరమాత్మను చేరుకోవడం సాధ్యమని తెలియుచున్నది. 
 
ఈ గోదా కళ్యాణం జరిగింది మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగి నాడు. అందువల్లనే అప్పటి నుండి ప్రతి సంవత్సరం భోగి రోజున గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు. శ్రీ మహావిష్ణువు మహా భక్తులైన ఆ 12 మంది ఆళ్వారులలో ఈ గోదా దేవి విష్ణుచిత్తుడు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు