రాములోరి కల్యాణానికి భద్రాచలం ముస్తాబు.. పెళ్లికళ వచ్చేసింది..

సోమవారం, 26 మార్చి 2018 (08:46 IST)
భద్రాచలంలోని మిథులా స్టేడియం రాములోరి కల్యాణానికి ముస్తాబు అయ్యింది. సోమవారం (మార్చి-26) మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికే రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు భద్రాద్రి చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు. 
 
మిథిలా స్టేడియం పరిసరాల్లో చలువ పందిళ్లు వేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో మిథిలా స్టేడియం వెలుగిపోతోంది. భారీ పోలీస్ భద్రతా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇకపోతే.. మంగళవారం (మార్చి-27) శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చి మహా పట్టాభిషేకం చేయనున్నారు. ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. 
 
ఇదిలా ఉంటే.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఆదివారం శ్రీరాముడికి, సకల సుగుణాల రాశి సీతమ్మకు సోమవారం జరిగే కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందు ఎదుర్కోలు వేడుకను కనుల పండువగా జరిపారు. ఈ క్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు. 
 
ఉదయం నుంచి ప్రసాదాల కౌంటర్ల వద్ద సందడి నెలకొంది. క్యూ కాంప్లెక్సులు కిటకిటలాడాయి. ఉచిత దర్శనాల వద్ద భక్తులు చాలాసేపు వేచిచూడాల్సి వచ్చింది. శ్రీరామ నామాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేద మంత్రోచ్ఛారణలు ఉత్సవ వైభవాన్ని మరింత పెంచాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు