ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి తెరాస కీలక నేతలు?

బుధవారం, 18 నవంబరు 2020 (15:03 IST)
ఇటీవల దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార తెరాస చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ విజయభేరీ మోగించింది. దీంతో పలువురు తెరాస నేతలు బీజేపీలోకి క్యూకట్టారు. 
 
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన ఆశావహులు టెన్షన్‌లో ఉన్నారు. టికెట్ రాకపోతే వేరే పార్టీలోకి జంప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 10 మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ పది మంది తనతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
 
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి పట్ల వారంతా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి కూడా టీఆర్ఎస్ భయపడుతోందని అన్నారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత... బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీలో చేరబోతున్న 10 మంది టీఆర్ఎస్ నేతలు ఎవరో మాత్రం ఆయన వెల్లడించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు