మద్యం మత్తులో కరెంటు వైర్లకు తగులుకున్నాడు...

శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:37 IST)
వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఎవరు... మృతికి గల కారాణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
మృతుడు వికారాబాద్ జిల్లా రాకంచర్లకు చెందిన గోపాల్‌గా(40) గుర్తించారు. రెండు రోజుల క్రితం అత్తగారిల్లైన దిర్సంపల్లి తాండాకు తన భర్యాతో వెళ్లాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తానని భార్యకు చెప్పి వెళ్ళిన గోపాల్ ఒక్క రోజు దాటినా ఇంటికి రాలేదు. నిన్న ఉదయం గడిసింగాపూర్ సమీపంలోని చింతలచెరువు దగ్గర అనుమానాస్పద స్థితిలో గోపాల్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
 
మృతుడి కాళ్ళపై విద్యుత్ తీగలు తగిలినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం దిర్సింపల్లికి వెళ్ళిన గోపాల్ గడిసింగాపూర్ సమీపంలో మృతి చెందడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
స్నేహితులతో కలిసి మద్యం సేవించిన గోపాల్ ప్రక్కనే పొలానికి వేసిన విద్యుత్ కంచెకు తగిలి చనిపోతే, తమపై వస్తుందేమోనని అతని స్నేహితులు గోపాల్ మృతదేహాన్ని గడిసింగాపూర్ సమీపంలో పడవేసినట్లు... నీ భర్త చనిపోయాడు, నీకు డబ్బులు ఇస్తాం ఎవ్వరికీ చెప్పొద్దని గోపాల్ భార్యకు చెప్పినట్లు గోపాల్ భార్య పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు