హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్

శనివారం, 23 మే 2020 (20:24 IST)
తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో ఉండే నిరుపేదలకు, దినసరి కూలీలకు నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది.
 
ఇక్కడ నిరుపేదలు పడుతున్న అవస్థల గురించి స్థానిక పెద్దలు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి అక్కడ పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేశారు. స్థానిక శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌ చేతుల మీదుగా ఈ నిత్యావసరాలను నాట్స్ పంపిణీ చేయించింది.
 
కరోనా కష్టకాలంలో పేదలకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేను ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ప్రశంసించారు. అమెరికాలో ఉంటున్న ఇక్కడ వారి కష్టాలు పట్టించుకోవడం.. వారికి సాయం చేయడం అభినందనీయమని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు