ఉత్కంఠ రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ బైపోల్ ఫలితం!

మంగళవారం, 10 నవంబరు 2020 (09:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. 
 
ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్‌ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. 
 
ప్రతి టేబుల్‌ను ఓ మైక్రో అబ్జర్వర్స్‌తోపాటు మిగతా అధికారులు పర్యవేక్షించనున్నారు. టేబుళ్ల వద్ద జరిగే లెక్కింపు పర్యవేక్షణ బాధ్యతలను ఏఆర్వోలకు అప్పగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపును తాసిల్దార్‌, ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 
 
కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 357 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. సిద్దిపేట పట్టణంలో కౌంటింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో పికెట్స్‌, టియర్‌ గ్యాస్‌ బృందాలు, కౌంటింగ్‌ కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌ అబ్జర్వేషన్‌ బృందాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. 
 
మరోవైపు, దుబ్బాకలో సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని అధికార తెరాస గట్టిగా చెబుతున్నా మెజారిటీ విషయంలో మాత్రం ఆ పార్టీ గుబులు చెందుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదట్లో మెజారిటీ పెంచుకోవడంపైనే దృష్టి సారించిన తెరాస... ఇప్పుడు గెలిస్తే చాలు అన్న స్థాయిలో ఉంది. 
 
కనీసం 25 వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నా పోలింగ్‌ తర్వాత వెలువడుతున్న అంచనాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి కారణం నియోజకవర్గంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరగడమే. 
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనవరి మూడో వారంలో జరుగుతాయనే సంకేతాలు రావడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దుబ్బాక ఫలితం కమలదళానికి ఆయుధంగా మారకూడదనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు