లింకులు పంపారు.. క్లిక్ చేయగానే.. ఖాతాలోని డబ్బును ఊడ్చేశారు...

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:03 IST)
సైబర్ నేరగాళ్లు సరికొత్త టెక్నిక్స్‌తో బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు. దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. మీరు గిఫ్ట్ ఓచర్లు గెలుచుకున్నారంటూ కొన్ని లింకులు పంపించారు. ఇది నిజమేనని నమ్మి క్లిక్ చేసిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 74 వేల రూపాయలను ఊడ్చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆ మహిళ లబోదిబో మంటోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ కవాడిగూడకు చెందిన ప్రియాంక అనే మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీరు కొన్ని బహుమతులు గెలుచుకున్నట్టు నమ్మించారు. వీటిని తీసుకోవాలంటే ఈ ఫారాలు నింపాలని, జీఎస్టీ, అమేజాన్‌ చార్జీలు చెల్లించాలంటూ చెప్పడంతో ఆమె నిజమని నమ్మింది. 
 
ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా కొన్ని లింకులు పంపించారు. ఆమె ఆ లింకులను క్లిక్‌ చేస్తూ అందులో వివరాలు నింపుతూ వెళ్లింది. అందులో బ్యాంకుకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సైబర్‌నేరగాళ్లు ఆమె ఖాతాలో నుంచి రూ.74 వేలు మాయం చేశారు. ఆ తర్వాత మొబైల్ నంబరుకు రూ.74 వేలు విత్‌డ్రా చేసినట్టు సందేశం రావడంతో అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ... లబోదిబో మంటోంది. 
 
అలాగే, మరో మహిళా ఉద్యోగిని కూడా ఇదే విధంగా మోసపోయింది. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదు తెలుసుకోడానికి బ్యాంకు నుంచి గిఫ్ట్‌ హోచర్లు పంపిస్తున్నామంటూ కొన్ని లింకులు పంపించారు. అది నిజమని నమ్మిన ప్రైవేట్‌ ఉద్యోగిని రజని ఆ లింకులు ఓపెన్‌ చేసింది. దీంతో ఆమె ఖాతాలలో నుంచి రూ.80 వేలు కాజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు